కలాం ఆశయాలు: బిజెపిలోకి అబ్దుల్ కలాం మనవడు
చెన్నై: మాజీ రాష్ట్రపతి, దివంగత అబ్దుల్ కలాం మనవడు భారతీయ జనతా పార్టీలో చేరారు. అబ్దుల్ కలాం మనవడైన ఏపీజే షేక్ సలీం బిజెపిలో చేరారు. భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షులు అమిత్ షా సమక్షంలో ఆయన కమల పార్టీ తీర్థం పుచ్చుకున్నారు.
సోమవారం నాడు సలీంను అమిత్ షా పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. అబ్దుల్ కలాం ఆశయాలను నెరవేర్చడమే తన లక్ష్యమని ఈ సందర్భంగా సలీం చెప్పారు. అబ్దుల్ కలాం పెద్దన్న మనవడు ఏపీజే సలీం. ఆయన ఢిల్లీలో బిజెపి తీర్థం పుచ్చుకున్నారు. ఏపీజే సలీం చిన్న వ్యాపారవేత్త.
కాగా, సలీం బిజెపిలో చేరడంపై తమిళనాడు బిజెపి ఉపాధ్యక్షుడు ఎం చక్రవర్తి స్పందించారు. అసెంబ్లీ ఎన్నికలకు ముందు సలీం చేరిక తమకు లాభమని అభిప్రాయపడ్డారు. పార్టీ పట్ల మైనార్టీల విశ్వాసానికి నిదర్శనం అని చెప్పారు.
సిలికాన్ వ్యాలీని జయించాం: వెంకయ్య
ప్రధాని నరేంద్ర మోడీ అమెరికా పర్యటన భారత సాంకేతిక చరిత్రలో ఒక మైలురాయి అని, మనం సిలికాన్ వ్యాలీని జయించామని కేంద్రమంత్రి వెంకయ్య నాయుడు సోమవారం అన్నారు.
అంతర్జాతీయ సాంకేతిక దిగ్గజాలు భారత్లో పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టేందుకు ముందుకురావడమంటే సాంకేతికరంగంలో భారత దశ ప్రారంభమైనట్లేనన్నారు. ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక సంక్షోభం నెలకొంటున్న నేపథ్యంలో పెట్టుబడులు పెట్టేందుకు ప్రపంచదేశాలకు భారతదేశం ఒక ఆశాదీపంలా కనిపిస్తోందన్నారు.
ఆ అవకాశాన్ని మనం సద్వినియోగం చేసుకుని మరింత ముందుకు సాగాలన్నారు. మోడీ అంటే 'అభివృద్ధి భారత నిర్మాత' అన్నారు. భారత్లో పెట్టుబడులు పెట్టేలా ప్రపంచ దేశాలకు ఆయన విశ్వాసం కల్పించారన్నారు. ప్రపంచ ఆర్థిక వ్యవస్థ మందగిస్తున్న తరుణంలోనూ భారత్లో 45 శాతం మేర విదేశీ పెట్టుబడులు పెరిగాయన్నారు.