అబ్దుల్ కలాం విజన్ 2020: ఆయుష్మాన్ భారత్తో ఆరోగ్య భారత్గా మారిందా..?
2000వ సంవత్సరంతో కొత్త శతాబ్దంలోకి అడుగుపెట్టాం. దీన్నే కొత్త మిలినియమ్ అని కూడా పిలిచాం. అయితే 2000వ సంవత్సరం వచ్చిందన్న ఆనందంకంటే 2020కి దేశ భవిష్యత్తు ఎలా ఉంటుంది అనేదానిపై చాలా మంది చాలా రకాలుగా విశ్లేషించారు. అప్పటికే టెక్నాలజీ రంగం కొత్త పుంతలు తొక్కుతోంది. అదే సమయంలో శాస్త్రసాంకేతిక రంగం కూడా దూసుకెళుతోంది. భారత్ దాదాపు అన్ని రంగాల్లో ప్రపంచదేశాలతో పోటీ పడటం ప్రారంభించింది. అయితే విజన్ 2020ని మాత్రం తొలిసారిగా ఆవిష్కరిచింది మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం.
విజన్ 2020: అబ్దుల్ కలాం స్వప్నం సాకారమైందా? భారత్ ఎలా ఉండాలనుకున్నారు..?
20 ఏళ్ల క్రితం విజన్ 2020 ఆవిష్కరణ
కొద్ది రోజుల్లో భారత రాష్ట్రపతిగా బాధ్యతలు చేపట్టబోయే ముందు అబ్దుల్ కలాం విజన్ 2020 గురించి ప్రస్తావించారు. ఇక 2002లో రాష్ట్రపతిగా బాధ్యతలు చేపట్టాక అప్పటి ప్రణాళిక సంఘం విజన్ 2020 యొక్క ముఖ్య ఉద్దేశాలను వివరించింది. ఒక డాక్యుమెంటు రూపంలో దీన్ని తీసుకొచ్చింది. ఇక 20 ఏళ్ల తర్వాత ఒక్కసారి విజన్ 2020ని చూస్తే భారత్ ఏమేరకు లక్ష్యాలను అందుకుందో విశ్లేషించుకోవాల్సి ఉంటుంది. అప్పుడు ఎలాంటి అంచనాలు వేశారు..? ఇప్పుడు ఎలాంటి పరిస్థితులు ప్రస్ఫుటిస్తున్నాయి..? విజన్ 2020లో నిర్దేశించిన లక్ష్యాలను భారత్ చేరుకుందా..? అన్ని రంగాల్లో భారత్ ఏ మేరకు వృద్ధి సాధించింది అనేది బేరీజు వేసుకోవాల్సి ఉంది. నిర్దేశించిన విజన్ 2020 లక్ష్యాలను భారత్ చేరుకుంది అని చెప్పేదానికంటే భారత్ ఈ 20 ఏళ్లల్లో మాత్రం అభివృద్ధి సాధించిందనే చెప్పాలి.
భారత్ను ఇప్పటికీ వదలని జబ్బులు
ప్రపంచంలో భారత్ రెండో అతిపెద్ద జనాభా ఉన్న దేశం. అలాంటప్పుడు ఇక్కడ ప్రజల ఆరోగ్యంపై ప్రభుత్వాలు ప్రత్యేక దృష్టి సారించాయి. కానీ ఆరోగ్యపరంగా చూసుకుంటే భారత్ను పలు వ్యాధులు ఇంకా పట్టి పీడిస్తున్నాయి. ప్రపంచ జనాభాలో భారత్ జనాభా 17.5శాతం ఉంది. అయితే ప్రపంచ వ్యాప్తంగా తీసుకుంటే భారత్లో 20శాతం జనాభా వివిధ రోగాలతో బాధపడుతోంది. ఎటు చూసినా రోగులతో ఆస్పత్రులు కిక్కిరిసి కనిపిస్తున్నాయి. జబ్బుల వలన 60 మిలియన్ మంది ప్రజలు ఏకంగా పేదరికంలోకి నెట్టివేయబడ్డారు. అంటే ఏడాదికి వారు సంపాదిస్తున్న దాంట్లో జబ్బులను నయం చేసేందుకు కావాల్సిన మెడిసిన్స్కే ఖర్చు చేస్తున్నట్లు వెల్లడైంది.
ప్రమాదకరంగా పరిణమించిన డాక్టర్ల కొరత
ఇక అత్యంత ప్రమాదకరమైన విషయమేంటంటే అతిపెద్ద జనాభా కలిగి ఉన్న భారత్లో వైద్యుల కొరత ఉందని లాన్సెట్ స్టడీ చెబుతోంది. రాష్ట్రాల వారీగా కూడా చాలా వ్యత్యాసం కనిపిస్తోంది. గోవా రాష్ట్రంలో ప్రతి 614 మందికి ఒక ప్రభుత్వ ఆస్పత్రి ఉంటే బీహార్ లాంటి రాష్ట్రంలో మాత్రం ప్రతి 8,789 మందికి ఒక ప్రభుత్వ ఆస్పత్రి ఉండటం ఆందోళన కలిగించే విషయం. ఇక పేదరికంతో ఉన్న రాష్ట్రాల్లో 10 ఆస్పత్రులు ఉంటే ఆరింటిలో ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ఉండదు. అంతేకాదు సరైన డ్రైనేజీ వ్యవస్థ కూడా ఉండదు.
ఆయుష్మాన్ భారత్తో మేలు జరుగుతోందా..?
ప్రజారోగ్యం కోసం కేంద్ర ప్రతిష్టాత్మకంగా ఆయుష్మాన్ భారత్ కార్యక్రమంను చాలా ప్రతిష్టాత్మకంగా ప్రారంభించింది. ప్రభుత్వం అయితే ప్రారంభించింది కానీ రోగులకు చికిత్స అందించేందుకు డాక్టర్ల కొరత మాత్రం స్పష్టంగా కనిపిస్తోంది. ఈ పథకం ద్వారా 10 కోట్ల మంది పేద కుటుంబాలకు మెరుగైన వైద్యం అందించాలని ప్రభుత్వం భావించింది. ఒక్కో కుటుంబానికి రూ.5 లక్షలు ఆరోగ్యం కోసం కేటాయించేందుకు ప్రభుత్వం ప్రణాళిక సిద్ధంచేసింది.ఈ పథకం కింద ప్రభుత్వ ప్రైవేట్ హాస్పిటల్లో ఎలాంటి డబ్బులు చెల్లించకుండా చికిత్స పొందే అవకాశం కల్పిస్తోంది. ఆయ రాష్ట్ర ప్రభుత్వాలతో కలిసి కేంద్రం ఈ పథకాన్ని అమలు చేస్తోంది. అంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు 60:40 నిష్పత్తితో ఒక వ్యక్తికి అయ్యే చికిత్సకు డబ్బులు చెల్లిస్తాయి.ఈశాన్య రాష్ట్రాల ప్రభుత్వాలతో కలిసి 90:10 లెక్కన పంచుకుంటున్నాయి. ఇక చట్టసభలు లేని కేంద్రపాలిత ప్రాంతాల్లో 100శాతం ఖర్చులు కేంద్రమే భరిస్తోంది.
విజన్ 2020లో నిర్దేశించిన లక్ష్యాలను భారత్ అందుకుందా..?
ఇప్పటికీ కొన్ని ప్రాంతాల్లో హాస్పిటల్స్ లేనందున పేద మహిళలు తమ డెలివరీల కోసం కొన్ని కిలోమీటర్ల దూరం ప్రయాణించాల్సి వస్తోంది. సరైన రహదారులు లేక కొంత మంది గర్భిణీలు ఆస్పత్రికి చేరేలోపే మరణిస్తున్న ఘటనలను చూస్తున్నాం. సరైన రవాణా సౌకర్యం లేక కాడికట్టి గర్భిణీ స్త్రీలను మోసుకెళ్తున్న దృశ్యాలను సైతం సామాజిక మాధ్యమాల్లో చూస్తున్నాం. మరి శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం ఈ స్థాయిలో పెరిగినప్పటికీ గ్రౌండ్ లెవెల్లో మాత్రం సదుపాయాలు పెరగలేదు. మొత్తానికి ఆరోగ్య భారత్ కావాలంటే మారుమూల గ్రామాలకు కూడా ఆస్పత్రులు ఉన్నప్పుడు, గ్రామీణ ప్రాంత ప్రజలకు, అటవీప్రాంతాల్లో నివాసముంటున్న ప్రజలకు మెరుగైన చికిత్స అందించగలిగితే విజన్ 2020లో ఆరోగ్యపరంగా నిర్దేశించుకున్న లక్ష్యాలను కొంతలో కొంతైనా అందుకోగలం.