దేశ ప్రజలు తిరస్కరించిన పథకంను అభిజీత్ ప్రశంసించడమేంటి: పీయూష్ గోయల్
పూణే: భారత సంతతి వ్యక్తికి నోబెల్ బహుమానం రావడం గర్వించదగ్గ విషయమే అయినప్పటికీ, నోబెల్ పురస్కార గ్రహీత అభిజీత్ బెనర్జీ వాదనలతో తాను ఏకీభవించనని చెప్పారు కేంద్ర వాణిజ్య మరియు పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్. భారత్ ఆర్థిక వ్యవస్థ గాడి తప్పిందంటూ అభిజీత్ బెనర్జీ చేసిన వ్యాఖ్యలపై స్పందించారు పీయూష్ గోయల్. బెనర్జీ లెఫ్ట్ భావజాలాలు ఉన్న వ్యక్తి అని చెప్పారు. 2019లో కాంగ్రెస్ చెప్పిన న్యాయ్ పథకంపై బెనర్జీ ప్రశంసలు కురిపించారని అయితే దాన్ని దేశ ప్రజలు లోక్సభ ఎన్నికల్లో తిరస్కరించారని గుర్తుచేశారు.
మహారాష్ట్ర ఎన్నికల సందర్భంగా పూణేలో జరిగిన ఎన్నికల ప్రచారంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా అక్కడి స్థానిక వ్యాపారస్తులతో గోయల్ భేటీ అయ్యారు. జీఎస్టీపై వ్యాపారస్తులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను మంత్రి దృష్టికి తీసుకొచ్చారు. ఇక ఎన్నికల విషయానికొస్తే బీజేపీ - శివసేన పార్టీలు 220 స్థానాలు గెలుస్తాయని ధీమా వ్యక్తం చేశారు. విపక్షాలపై నిందలు వేయడం మానేసి ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టడంపై ఆలోచించాలన్న మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ వ్యాఖ్యలను ఆయన తేలిగ్గా తీసిపారేశారు.
భారత సంతతి వ్యక్తి అభిజీత్ బెనర్జీకి ఆర్థికరంగంలో నోబెల్ పురస్కారం రావడంపై తాన సంతోషం వ్యక్తం చేస్తున్నట్లు చెప్పిన గోయల్... అదే సమయంలో తన వాదనతో ఏకీభవించనని స్పష్టం చేశారు. న్యాయ్ పథకంతో కాంగ్రెస్ లోక్సభ ఎన్నికలకు వెళ్లిందని అయితే కాంగ్రెస్ను ఆలోచనను ప్రజలు తిరస్కరించారని వెల్లడించారు. ప్రజలు తిరస్కరించినదాన్ని అభిజీత్ తిరిగి చెప్పడం ఆమోదయోగ్యం కాదని గోయల్ తెలిపారు. అందుకే అభిజీత్ ఐడియాలపై పెద్దగా ఆలోచించాల్సిన పనిలేదని వెల్లడించారు. ఇక మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ తాను పదవి నుంచి దిగిపోయేనాటికి అంటే 2014లో దేశ ఆర్థిక పరిస్థితి చాలా దీనంగా ఉండేదని, ప్రధానిగా మోడీ వచ్చిన తర్వాత ఆర్థిక పరిస్థితి పరుగులు తీసిందని చెప్పారు.
ఇక మన్మోహన్ సింగ్ ప్రధానిగా ఉన్న సమయంలోనే దేశంలో అతిపెద్ద కుంభకోణాలు జరిగాయని గుర్తుచేశారు. ఇందులో టెలికాం స్కామ్, బొగ్గ స్కాం, ఇరిగేషన్ స్కామ్ వంటివి జరిగాయని గోయల్ మండిపడ్డారు. ఇవన్నీ కళ్లముందు కనిపించినప్పుడు ప్రధానిగా ఖండించాల్సిందిపోయి... సంకీర్ణ ప్రభుత్వంలో కొన్ని కంపల్షన్స్ ఉంటాయని మన్మోహన్ సింగ్ చెప్పడం సిగ్గుచేటు అని గోయల్ ధ్వజమెత్తారు.