పాక్కు ఆధీనంలోకి వెళ్లకముందు చివరి సందేశం!: మానసికంగా వేధించారు.. అభినందన్
న్యూఢిల్లీ: భారత సైనిక స్థావరాలను లక్ష్యంగా చేసుకొని, మనవైపు వచ్చిన పాకిస్తాన్ యుద్ధ విమానాలను.. అభినందన్ సహా ఇతర వింగ్ కమాండర్లు ధీటుగా ఎదుర్కొన్ని విషయం తెలిసిందే. ఈ పోరులో సిద్ధార్థ వశిష్ట్ అమరుడయ్యారు. అభినందన్ పాక్ ఎఫ్ 16ను వెంబడించి, దానిని కూల్చేశారు. కానీ పాక్కు దొరికారు. ఆ తర్వాత విడుదలయ్యారు.
అతను పాకిస్తాన్కు దొరకకముందు చివరి రేడియో మెసేజ్ 'పాకిస్తాన్కు చెందిన ఎఫ్ 16ను లాక్ చేశాను.. ఆర్-73 సెలక్టెడ్'.. ఇది ఆయన అప్పుడు పలికిన చివరి మాటలు.
ఇదిలా ఉండగా, పాక్ చేతిలో బందీగా ఉన్నప్పుడు తనను మానసికంగా వేధించారని వింగ్ కమాండర్ అభినందన్ రక్షణమంత్రి నిర్మలా సీతారామన్కు చెప్పారు. అయితే, అతను పాక్లో వేధింపులకు గురైనా మానసికంగా బలంగా, చురుగ్గానే ఉన్నట్లు అధికార వర్గాలు తెలిపాయి. శనివారం ఢిల్లీలో సైన్యానికి చెందిన రీసెర్చి, రిఫరల్ ఆసుపత్రిలో అభినందన్ను రక్షణమంత్రి కలుసుకున్నారు.
అభినందన్ భార్య విశ్రాంత స్క్వాడ్రన్ లీడర్ తన్వీ మార్వా, కుమారుడు, సోదరి, కొంతమంది సీనియర్ సైనిక అధికారులు కూడా అక్కడ ఉన్నారు. ఈ సందర్భంగా పాకిస్థాన్లో తాను గడిపిన దాదాపు అరవై గంటల్లో జరిగిన పరిణామాలను అభినందన్ రక్షణమంత్రికి వివరించారు. పాక్ అధికారులు తనను మానసికంగా వేధించిన తీరును క్లుప్తంగా చెప్పినట్లు అధికారులు పేర్కొన్నారు.
పాక్ ఆధీనంలో ఉన్న సమయంలో అభినందన్ ప్రదర్శించిన ధైర్యాన్ని రక్షణ మంత్రిత్వశాఖ కొనియాడింది. భారత సాయుధ బలగాల్లో అత్యుత్తమ సైనికుడిని దేశం అతడిలో చూసిందని పేర్కొంది. జాతి గౌరవం కోసం.. మీరు వ్యక్తిగత భద్రత కంటే విధి నిర్వహణకే అధిక ప్రాధాన్యమిచ్చారని, ప్రతికూల పరిస్థితుల్లో ప్రశాంతంగా, దృఢంగా వ్యవహరించారని, అభినందన్ చరిత్ర సృష్టించారని, భారత సాయుధ బలగాల్లో అత్యుత్తమ సైనికుడిని మీలో చూశామని, వైమానికదళ వీరుడా శెభాష్ అని రక్షణ మంత్రిత్వశాఖ అధికార ప్రతినిధి ట్విటర్ హ్యాండిల్లో ట్వీట్ చేశారు.
పాక్ నుంచి బయటపడిన అభినందన్కు ప్రస్తుతం పలు రకాల వైద్య పరీక్షలు నిర్వహించారు. శనివారం ఉదయం అభినందన్ను కుటుంబ సభ్యులు కలిశారు. వైమానిక దళాధిపతి ఎయిర్ చీఫ్ మార్షల్ ధనోవాతో పాటు ఐఏఎఫ్కు చెందిన ఇతర ఉన్నతాధికారులు అతనిని విడిగా కలుసుకున్నారు. తనను శారీరకంగా హింసించకపోయినా, మానసికంగా తీవ్రంగా వేధించారని ఉన్నతాధికారులకు వెల్లడించినట్లు తెలుస్తోంది.
శుక్రవారం అటారి-వాఘా సరిహద్దు నుంచి భారత్లోకి ప్రవేశించిన అభినందన్ దాదాపు రెండున్నర గంటల తర్వాత రాత్రి పన్నెండు గంటల ప్రాంతంలో ఐఏఎఫ్ విమానంలో ఢిల్లీ చేరుకున్నారు. ముందుగా త్రివిధ దళాలకు ప్రత్యేక వైద్య పరిశీలన జరిపే వైమానికదళ కేంద్ర వైద్య సంస్థకు తీసుకు వెళ్లారు. తర్వాత రీసెర్చి, రిఫరెల్ ఆసుపత్రికి తరలించారు. అభినందన్కు శనివారం పలు వైద్యపరీక్షలు నిర్వహించారు. ఆదివారం కూడా అనేక పరీక్షలు నిర్వహించనున్నారు.