ఏపీబీ-సీ ఓటరు సర్వే: యూపీలో బీజేపీకి 25, ఎస్పీ-బీఎస్పీలకు 51 సీట్లు, ప్రియాంకగాంధీ రాకతో...
న్యూఢిల్లీ: రానున్న లోకసభ ఎన్నికల్లో ఉత్తర ప్రదేశ్లో భారతీయ జనతా పార్టీకి (బీజేపీ) భారీ షాక్ తప్పదని ప్రీపోల్ సర్వేలు వెల్లడిస్తున్నాయి. తాజాగా గురువారం ఏబీపీ - సీ ఓటరు సర్వే ఫలితాలు విడుదలయ్యాయి. ఈ సర్వేలో బీజేపీకి 25 సీట్లు వస్తాయని తేలింది.
ఎస్పీ, బీఎస్పీ, రాష్ట్రీయ లోక్దళ్ నేతృత్వంలోని కూటమికి 51 సీట్లు వస్తాయని తేలింది. అదే జరిగితే 2014 ఎన్నికల కంటే బీజేపీకి 48 సీట్లు తక్కువ రానున్నాయి. అప్పుడు బీజేపీ 73 సీట్లు గెలుచుకుంది. గత ఏడాది డిసెంబర్లో చేసిన సర్వేలో బీజేపీకి 36 సీట్లు వస్తాయని తేలింది.
ఓటు షేర్ విషయంలో బీజేపీకి బాగానే ఉంది. కూటమికి 43 శాతం ఓట్లు, ఎన్డీయేకు 42 శాతం ఓట్లు పడతాయని తేలింది. అయితే, బుధవారం ప్రియాంక గాంధీని యూపీ ఈస్ట్కు ఏఐసీసీ ప్రధాన కార్యదర్శిగా నియమించారు. ఈ సర్వే అంతకుముందు చేసింది. ఇప్పుడు ప్రియాంక గాంధీ ఎంటర్ కావడంతో కొంత తారుమారు అయ్యే అవకాశాలు ఉన్నాయని చెబుతున్నారు.