ఏబీపీ-సీ ఓటరు సర్వే: యూపీ దెబ్బతీసినా మళ్లీ మోడీయే ప్రధాని, తెలుగు రాష్ట్రాల్లో వీరిదే!
న్యూఢిల్లీ: ఏబీపీ - సీ ఓటరు సర్వేలో 2019లో తిరిగి నరేంద్ర మోడీ రెండోసారి ప్రధాని అవుతారని తేలింది. దేష్ కా మూడ్ పేరుతో ఈ సర్వే చేసింది. యూపీలో బీజేపీకి గట్టి దెబ్బ పడనుంది. అయితే కొన్ని సీట్లు తగ్గినా, ఓటు షేర్ తగ్గినా బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయేనే తిరిగి అధికారంలోకి వస్తుందని సర్వేలో తేలింది.
ఏబీపీ - సీ ఓటరు సర్వే- దేశ్ కీ మూడ్ సర్వే: యూపీలో బీజేపీకి షాక్
సర్వే ప్రకారం దక్షిణాదిన బీజేపీ ఎక్కువ సీట్లు దక్కించుకునే అవకాశం లేదు. దేశవ్యాప్తంగా చూస్తే ఎన్డీయేకు 38 శాతం, యూపీఏకు 25 శాతం, ఇతరులకు 37 శాతం ఓటు షేర్ రానుంది. యూపీలో ఎస్పీ, బీఎస్పీ కలిస్తే కాంగ్రెస్ ఎక్కువ లబ్ధి పొందనుందని సర్వేలో వెల్లడైంది. సర్వే ప్రకారం మొత్తం 543 సీట్లకు గాను ఎన్డీయే 276, యూపీఏ 112, ఇతరులు 155 సీట్లు గెలవనున్నారు.
మహారాష్ట్రలో ఇదీ ఒపీనియన్ లెక్క
ఒపీనీయన్ పోల్ ప్రకారం మహారాష్ట్రలోని 48 లోకసభ స్థానాల్లో ఎన్డీయేకు 16, యూపీఏకీ 30, శివసేనకు 2 సీట్లు వస్తాయని తేలింది. అయితే కాంగ్రెస్ ఎన్సీపీతో పొత్తు పెట్టుకొని, బీజేపీ-శివసేనలు వేర్వేరుగా పోటీ చేస్తే పై లెక్క. శివసేన-బీజేపీ, కాంగ్రెస్-ఎన్సీపీ పొత్తుతో వెళ్తే ఎన్డీయే దరిదాపుల్లోకి కూడా కాంగ్రెస్ వచ్చేలా లేదు. అప్పుడు ఎన్డీయేకు 36, యూపీఏకు 12 సీట్లు రానున్నాయి. ఒకవేళ అన్ని పార్టీలు వేర్వేరుగా పోటీ చేస్తే బీజేపీకి 22, కాంగ్రెస్కు 30, ఎన్సీపీకి 8, శివసేనకు 7 వస్తాయి.
ఢిల్లీ, హర్యానా, పంజాబ్లలో ఒపీనియన్ పోల్
ఢిల్లీలో 7 లోకసభ స్థానాలు ఉండగా ఎన్డీయేకు 7 వస్తాయని, యూపీఏకు ఏమీ రావని సర్వేలో తేలింది. హర్యానాలో 10 లోకసభ స్థానాలకు గాను ఆరు ఎన్డీయేకు, యూపీఏకీ 3, ఇతరులకు ఒకటి వస్తుందని సర్వేలో తేలింది. పంజాబ్లో యూపీఏ సత్తా చాటనుంది. ఇక్కడ ఎన్డీయేకు ఒకటే సీటు వస్తుందని తేలగా, యూపీఏకీ 12 సీట్లు వస్తాయని అంచనా.
ఈశాన్య రాష్ట్రాల్లో బీజేపీ ముందంజ
ఈశాన్య రాష్ట్రాల్లో బీజేపీ చాలా ముందంజలో ఉంది. అసోం, మణిపూర్, మిజోరాం, త్రిపుర, సిక్కిం, నాగాలాండ్లలో ఎన్డీయే 18 సీట్లు గెలుచుకుంటుందని సర్వే అంచనా కాగా, యూపీఏ 6, ఇతరులు ఒక సీట్లు గెలుచుకుంటారు.
దక్షిణాదిన ఎన్డీయేకు 21, యూపీఏకీ 32
ఒడిశా రాష్ట్రంలో బీజేపీ 13, బీజేడీ 6, కాంగ్రెస్ పార్టీ 2 స్థానాలు గెలుచుకుంటుందని సర్వేలో తేలింది. దక్షిణాది రాష్ట్రాలు కేరళ, తమిళనాడు, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ విషయానికి వస్తే బీజేపీ గతంలో కంటే సత్తా చాటే అవకాశాలు లేవని సర్వేలో వెల్లడైంది. దక్షిణాదిన ఎన్డీయేక 21, యూపీఏకు 32, ఇతరులకు 76 సీట్లు రానున్నాయని అంచనా. ఏపీ, తెలంగాణలలో తెలుగుదేశం, వైయస్సార్ కాంగ్రెస్, టీఆర్ఎస్ పార్టీలదే హవాగా ఉంది. తమిళనాడులోను రీజినల్ పార్టీలో సత్తా చాటనున్నాయి.