ABP CVoter Survey: యోగీ ఓకే కానీ..యూపీలో ప్రభుత్వ మార్పు తప్పదంటోన్న మెజారిటీ ఓటర్లు
లక్నో: వచ్చే ఏడాది అయిదు అసెంబ్లీ రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు చోటు చేసుకోనున్నాయి. ఈ అయిదింట్లో ఒక్కటి తప్ప మిగిలిన నాలుగు రాష్ట్రాల్లో భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉండటం, 400కు పైగా స్థానాలు ఉన్న ఉత్తర ప్రదేశ్ ఇందులో ఉండటంతో అందరి దృష్టీ ఈ ఎన్నికలపై నిలిచింది. ఉత్తర ప్రదేశ్, ఉత్తరాఖండ్, గోవా, మణిపూర్లల్లో బీజేపీ అధికారంలో ఉండగా..పంజాబ్ను కాంగ్రెస్ పరిపాలిస్తోంది. ఏబీపీ సీఓటర్ సర్వే తాజాగా ఉత్తర ప్రదేశ్లో నిర్వహించిన సర్వే.. అక్కడి ప్రజల మనోబావాలకు అద్దం పడుతోంది.
యోగి వైపే మొగ్గు..
ఏబీపీ సీఓటర్ సర్వేను బట్టి చూస్తే- వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఉత్తర ప్రదేశ్లో బీజేపీ మరోసారి అధికారాన్ని ఏర్పాటు చేసేలా కనిపిస్తోంది. ముఖ్యమంత్రిగా యోగి ఆదిత్యనాథ్ వైపు 41.5 శాతం మంది మొగ్గు చూపుతున్నారు. ముఖ్యమంత్రిగా ఆయన పరిపాలన బాగుందని అభిప్రాయపడుతున్నారు. ఆయన పనితీరు బాగోలేదని చెబుతున్న వారి సంఖ్య కూడా చెప్పుకోదగ్గ స్థాయిలో ఉంటోంది. 37.4 శాతం మంది ఆయన పరిపాలనను సమర్థించట్లేదు. మరో 21.1 శాతం మంది ఫర్వాలేదని అంటోన్నారు.
ఆదిత్యనాథ్-అఖిలేష్-మాయావతి..
ఉత్తర ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రులు అఖిలేష్ యాదవ్, మాయావతితో పోల్చుకుని చూస్తే- ముఖ్యమంత్రిగా యోగి ఆదిత్యనాథ్ను మెచ్చుకునే వారి శాతం అధికంగా ఉంటోంది. ఉత్తర ప్రదేశ్ తరువాతి ముఖ్యమంత్రిగా యోగిని 42.8 శాతం మంది సమర్థిస్తున్నారు. అఖిలేష్ యాదవ్-32.2, మాయావతి-15.4 శాతం మంది మద్దతిస్తున్నారు. ప్రియాంక గాంధీ వాద్రా-3.6, రాష్ట్రీయ లోక్దళ్ అధినేత జయంత్ చౌదరి-1.6 శాతం మంది మొగ్గు చూపుతున్నారు.
బీజేపీ ప్రభుత్వంపై విముఖత..
ముఖ్యమంత్రిగా యోగి ఆదిత్యనాథ్ పనితీరును మెజారిటీ ప్రజలు సమర్థిస్తున్నప్పటికీ.. బీజేపీ ప్రభుత్వం పట్ల వారందరూ విముఖతను చూపుతుండటం ప్రాధాన్యతను సంతరించుకుంది. ప్రభుత్వం మారాలని కోరుకుంటోన్న ఉత్తర ప్రదేశ్ ఓటర్ల శాతం 48.3 శాతంగా ఉంది. ప్రభుత్వం పట్ల వారిలో ఆగ్రహావేశాలు వ్యక్తమౌతున్నాయి. ప్రభుత్వం పట్ల వ్యతిరేకత ఉన్నప్పటికీ.. 27.5 శాతం మంది ఓటర్లు బీజేపీనే కోరుకుంటోన్నారు. అలాగే- ప్రభుత్వం మీద వ్యతిరేకత లేని ఓటర్లు 24.2 శాతం మంది ఉన్నారు.
బీజేపీ గెలుస్తుందంటూ..
ఉత్తర ప్రదేశ్లో మళ్లీ బీజేపీ అధికారాన్ని ఏర్పాటు చేస్తుందని భావించే ఓటర్ల శాతం 45.3 శాతం. ఈ విషయంలో సమాజ్వాది పార్టీ వైపు 29.8 శాతం మంది నిలిచారు. బహుజన్ సమాజ్ వాది పార్టీకి మద్దతు ఇస్తోన్న ఓటర్ల శాతం నామమాత్రంగా ఉంటోంది. 8.1 శాతం మంది మాత్రమే బీఎస్పీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని అంచనా వేస్తోన్నారు. కాంగ్రెస్ వైపు నిల్చున్న వారు ఎనిమిది శాతం మాత్రమే. ఇవే తరహా ఫలితాలు వస్తాయనేది గ్యారంటీ లేదని ఏబీవీ సీఓటర్ సర్వే అంచనా వేసింది.
రైతుల ఆందోళన.. కీలకంగా..
వచ్చే ఉత్తర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో రైతుల ఆందోళన కీలక పాత్ర పోషించడం ఖాయంగా కనిపిస్తోంది. 26.9 శాతం వరకు ఈ అంశం అక్కడి రాజకీయాలను ప్రభావితం చేస్తుందని ఏబీపీ సీఓటర్ సర్వే అభిప్రాయపడింది. మత రాజకీయాలు 16.1 శాతం, కరోనా వైరస్ నిర్వహణ 15.2 శాతం, మాఫియా, గ్యాంగ్స్టర్ల ఆట కట్టించడం 13.5 శాతంగా వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఓటర్లను ప్రభావితం చేస్తుందని తేలింది. అక్రమ కబేళాలను మూసి వేయించడం, ముఖ్యమంత్రి స్వరోజ్గార్ యోజన, యాంటీ రోమియో స్క్వాడ్లను ఏర్పాటు చేయడం వంటివి 10.6 శాతం మేర ప్రభావితం చేస్తాయని ఈ సర్వే పేర్కొంది.