ఏబీపీ న్యూస్ ఎగ్జిట్ పోల్ : బెంగాల్లో దీదీ కోటకు బీటలు.. ఒడిశాలో బీజేపీ దూకుడు..
సార్వత్రిక ఎన్నికల్లో బెంగాల్, ఒడిశాల్లో బీజేపీ దూసుకుపోతుందని ఏబీపీ న్యూస్ ఎగ్జిట్ పోల్ ఫలితాలు చెబుతున్నాయి. ఈసారి బెంగాల్లో దీదీ కోటకు బీటలు తప్పవన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. అటు ఒడిశాలోనూ బీజేపీ పునాదులు మరింత బలపడినట్లు సర్వే ఫలితాలు స్పష్టం చేస్తున్నాయి. బెంగాల్లోని మొత్తం 42 స్థానాల్లో 2014లో తృణమూల్ కాంగ్రెస్ 34 స్థానాలు గెల్చుకోగా.. ఈసారి 24 స్థానాలకు పరిమితమవుతుందని ఎగ్జిట్ పోల్ చెబుతోంది. గత ఎన్నికల్లో కేవలం 2స్థానాలు మాత్రమే ఖాతాలో వేసుకున్న బీజేపీ ఈసారి 24 సీట్లలో విజయం సాధించడం ఖాయమంటోంది. కాంగ్రెస్ కేవలం రెండు స్థానాల్లో మాత్రమే ప్రభావం చూపుతుందని సర్వే స్ఫష్టం చేస్తోంది.
ఒడిశాలోనూ బీజేపీ పట్టు పెరిగినట్లు ఏబీపీ ఎగ్జిట్ పోల్ లెక్కలు చెబుతున్నాయి. రాష్ట్రంలో మొత్తం 21 సీట్లు ఉండగా... నవీన్ పట్నాయక్ నేతృత్వంలోని బీజేడీ 12 స్థానాల్లో విజయం సాధించనుండగా.. గతంలో ఒక్కస్థానాన్ని మాత్రమే గెల్చుకున్న బీజేపీ ఈసారి లెక్క 9కి పెంచుకుంటుందని సర్వే లెక్కలు చెబుతున్నాయి. కాంగ్రెస్ పార్టీ ఈసారి ఒక్కసీటు కూడా ఖాతాలో వేసుకునే అవకాశమేలేదని ఏబీపీ స్పష్టం చేసింది.
ప్రధాని మోడీ సొంత రాష్ట్రమైన గుజరాత్లో బీజేపీ సత్తా చాటుతుందని ఏబీపీ అంటోంది. అక్కడ మొత్తం 26 స్థానాల్లో 24 సీట్లు బీజేపీ గెలుచుకోనుంది. కాంగ్రెస్ రెండు స్థానాలకు పరిమితం కానుంది. పది స్థానాలున్న హర్యానాలో బీజేపీ 7, కాంగ్రెస్ 3 సీట్లు ఖాతాలో వేసుకోనున్నాయి. మహారాష్ట్రలో మాత్రం బీజేపీ ఈసారి కాస్త వెనకబడుతుందని సర్వే గణాంకాలు చెబుతున్నాయి. గత ఎన్నికల్లో 42 సీట్లు గెల్చుకున్న బీజేపీ - శివసేన ఈసారి 34 సీట్లకు పరిమితం కానుంది. ఇక కాంగ్రెస్ - శివసేన కూటమి 8సీట్లు మెరుగుపరుచుకుని 14 సీట్లు సాధించనుంది. పంజాబ్లో కాంగ్రెస్ దూసుకుపోతుందని ఏబీపీ సర్వే స్పష్టం చేస్తోంది. 13 స్థానాల్లో కాంగ్రెస్ 8 సొంతం చేసుకోనుండగా.. బీజేపీ 3, ఆమ్ ఆద్మీ పార్టీ 2 స్థానాలను అకౌంట్లో వేసుకోనున్నాయి. జమ్మూ కాశ్మీర్లో 6స్థానాల్లో బీజేపీ, ఎన్సీపీ, పీడీపీలు 2 సీట్ల చొప్పున గెలుచుకోనున్నారు. అక్కడ కాంగ్రెస్ కనీసం ఒక్కసీటు కూడా గెలవలేదని ఏబీపీ ఎగ్జిట్ పోల్ స్పష్టం చేస్తోంది.