ఏబీపీ న్యూస్ ఎగ్జిట్ పోల్ : యూపీలో క్లీన్ స్వీప్ చేయనున్న మహాకూటమి
ఢిల్లీ పీఠానికి దగ్గరి దారిగా భావించే ఉత్తర్ప్రదేశ్లో ఎస్పీ, బీఎస్పీ కూటమి విజయఢంకా మోగిస్తుందని ఏబీపీ న్యూస్ ఎగ్జిట్ పోల్ సర్వే స్పష్టం చేసింది. బీజేపీని ఓడించేందుకు ఏకతాటిపైకి రావాలన్న ఎస్పీ, బీఎస్పీ, ఆర్ఎల్డీల ప్లాన్ వర్కౌట్ అయినట్లు తెలుస్తోంది. రాష్ట్రంలో 90వేల 600మంది ఓటర్ల అభిప్రాయాలను పరిగణలోకి తీసుకుని సర్వే ఫలితాలు వెల్లడించింది. ఉత్తర్ ప్రదేశ్లో మొత్తం 80 స్థానాలుండగా.. ఎస్పీ - బీఎస్పీ, ఆర్ఎల్డీ కూటమి 56 స్థానాల్లో విజయం సాధిస్తుందని చెప్పింది. గత ఎన్నికల్లో 73సీట్లు గెల్చుకున్న బీజేపీ ఈసారి 22 స్థానాలకు పరిమితం కానున్నట్లు తెలుస్తోంది. ప్రత్యక్ష రాజకీయాల్లో అడుగుపెట్టిన ప్రియాంక గాంధీ కాళ్లకు బలపం కట్టుకుని ప్రచారం చేసినా ఆ కాంగ్రెస్ సత్తా చాటలేకపోయినట్లు సర్వే వివరాలు చెబుతున్నాయి. యూపీలో ఆ పార్టీ కేవలం 2సీట్లకే పరిమితవుతుందని ఏబీపీ న్యూస్ ఎగ్జిట్ పోల్స్ స్పష్టం చేస్తున్నాయి.
ఉత్తర్ప్రదేశ్ పశ్చిమ ప్రాంతంలో 27 స్థానాలుండగా 2014లో బీజేపీ 24 సీట్లు గెల్చుకుంది. అయితే ఈసారి ఆ పార్టీకి భారీ నష్టం తప్పదని ఏబీసీ న్యూస్ స్పష్టం చేస్తోంది. 2019 ఎన్నికల్లో పశ్చిమ యూపీలో ఎస్పీ - బీఎస్పీ - ఆర్ఎల్డీ కూటమి 21 సీట్లతో విజయదుందుభి మోగిస్తుందని సర్వే వివరాలు చెబుతున్నాయి. బీజేపీ 6స్థానాలకు పరిమితం కానుండగా.. కాంగ్రెస్ ఖాతా కూడా తెలియదని ఏబీపీ సర్వే తేల్చిచెప్పింది.
పూర్వాంచల్ బాధ్యతలు భుజాన వేసుకున్న కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ ప్రియాంకగాంధీ ఏ మాత్రం ప్రభావం చూపలేకపోయారని సర్వే ఫలితాలు చెబుతున్నాయి. పూర్వాంచల్లో 26 స్థానాలుండగా.. వాటిలో ఎస్పీ - బీఎస్పీ - ఆర్ఎల్డీ మహాకూటమి 18సీట్లు ఎగరేసుకుపోతుండగా.. బీజేపీ 8 స్థానాలకు పరిమితం కానుంది. తూర్పు యూపీలోనూ కాంగ్రెస్ ఖాతా కూడా తెరవదని సర్వే స్పష్టం చేసింది. అవధ్లో ఉన్న 23 స్థానాల్లో మహాఘట్బంధన్ 14 స్థానాలు గెలుచుకుంటాయని, బీజేపీ 7, కాంగ్రెస్ 2సీట్లను సాధిస్తాయని ఏబీపీ సర్వే చెబుతోంది. ఇక 4స్థానాలున్న బుందేల్ ఖండ్లో ఎస్పీ, బీఎస్పీ, ఆర్ఎల్డీ కూటమి 3 సీట్లు, బీజేపీ 1 స్థానంలో గెలుపొందనుండగా... కాంగ్రెస్ ఒక్క స్థానంలో కూడా విజయం సాధించదని సర్వే ఫలితాలు స్పష్టం చేస్తున్నాయి.