టెన్షన్ ఉంటే.. అభివృద్ధిపై అటెన్షన్ ఉండదు: వెంకయ్య నాయుడు
న్యూఢిల్లీ: ఆర్టికల్ 370 రద్దు అంశంపై ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు. ఆర్టికల్ 370 రద్దుతోనే జమ్మూకాశ్మీర్కు విముక్తి లభించిందని, దీంతో అక్కడ అభివృద్ధి జరుగుతోందని ఆయన అన్నారు. కొన్ని దశాబ్దాలుగా ఉగ్రవాదం కారణంగా జమ్మూకాశ్మీర్లో అభివృద్ధిలో వెనుకబడిందని అన్నారు.
370 రద్దుతో అడ్డంకులు తొలగిపోయాయి..
జమ్మూకాశ్మీర్, లడఖ్కు చెందిన పలువురు విద్యార్థులు ఉపరాష్ట్రపతిని ఆయన నివాసంలో కలిశారు. ఈ సందర్భంగా వెంకయ్యనాయుడు ట్విట్టర్ వేదికగా ఈ మేరకు వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం ఆర్టికల్ 370 రద్దతో అన్ని అడ్డంకులు తొలగిపోయి.. జమ్మూ, కాశ్మీర్లు అభివృద్ధి పథంలో పురోగమించడం ప్రారంభించాయని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు వ్యాఖ్యానించారు.
టెన్షన్ ఉన్న చోట..
సీమాంతర ఉగ్రవాదం వల్ల తెలివైన ఒక తరం స్థానిక యువత అవకాశాలను కోల్పోయిందని, ఈ పరిస్థితి ఇలాగే కొనసాగేందుకు తాము అంగీకరించలేదని ఉపరాష్ట్రపతి అన్నారు. త్వరితగతిన ఆ ప్రాంత అభివృద్ధి జరగాలంటే ఆర్టికల్ 370 రద్దు ఎంతో అవసరమని అన్నారు. టెన్షన్ ఉన్న చోట అటెన్షన్ ఉండదని.. దీంతో అభివృద్ధి జరగదని ఆయన వ్యాఖ్యానించారు.
దేశానికి కిరీటం..
జమ్మూకాశ్మీర్ దేశానికి కిరీటం లాంటిదని, మంచు పర్వతాలు, పచ్చని లోయలు, నదీప్రవాహాలు వంటి ఎన్నో అందాలతో ఆహ్లాదభరితమైన వాతావరణం ఆ ప్రాంతం సొందమని ఉపరాష్ట్రపతి వ్యాఖ్యానించారు. ప్రజల స్నేహపూర్వక స్వభావం, ఆధ్యాత్మికత, ఆచార వ్యవహారాలు, వంటకాలు, సంస్కృతి, సంగీతానికి కాశ్మీర్ ఎంతో ప్రసిద్ధి అని వెంకయ్యనాయుడు వ్యాఖ్యానించారు.
వేగవంతమైన మార్పులు..
ఈ సందర్భంగా జమ్మూకాశ్మీర్ విద్యార్థులను దేశ రాజధాని ఢిల్లీ పర్యటనకు తీసుకొచ్చిన భారత సైన్యాన్ని ఉపరాష్ట్రపతి అభినందించారు. ఈ పర్యటన మీకు గుర్తుండిపోతుంది.. మీరు దేశంలో వేగవంతమైన మార్పులను చూడబోతున్నారు.. వాటి ద్వారా కొత్త అవకాశాలు లభిస్తాయి అని విద్యార్థులను ఉద్దేశించి ఉపరాష్ట్రపతి ట్విట్టర్ వేదికగా వ్యాఖ్యలు చేశారు. విద్యార్థులు తమ మంచి భవిష్యత్తును నిర్దేశించుకుని దేశాభివృద్ధిలో భాగస్వాములు కావాలని ఈ సందర్భంగా ఉపరాష్ట్రపతి పిలుపునిచ్చారు.