‘ఆర్టికల్ 370 రద్దు’పై సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం: 1 నుంచి విచారణ
న్యూఢిల్లీ: ఆర్టికల్ 370 రద్దుపై దాఖలైన పిటిషన్లపై విచారణకు రాజ్యాంగ ధర్మాసనం ఏర్పాటు చేసింది సుప్రీంకోర్టు. జస్టిస్ ఎన్వీ రమణ నేతృత్వంలో ఐదుగురు సభ్యులతో కూడిన ధర్మాసనాన్ని ఏర్పాటు చేసింది. వచ్చే మంగళవారం (అక్టోబర్ 1) నుంచి ఈ పిటిషన్లపై విచారణ చేపట్టనుంది ఈ ధర్మాసనం.
జమ్మూకాశ్మీర్కు ప్రత్యేక ప్రతిపత్తిని కల్పించే ఆర్టికల్ 370 రద్దును సవాల్ చేస్తూ దాఖలైన పటిషన్లపై ఇటీవల ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగొయ్ నేతృత్వంలోని ప్రత్యేక ధర్మాసనం విచారణ చేపట్టిన విషయం తెలిసిందే. ఈ పిటిషన్లపై విచారణ కోసం రాజ్యాంగ ధర్మాసనం ఏర్పాటు చేస్తామని ఆ సమయంలో ప్రధాన న్యాయమూర్తి తెలిపారు.
ఈ నేపథ్యంలోనే జస్టిస్ ఎన్వీ రమణ నేతృత్వంలో రాజ్యాంగ ధర్మాసనం ఏర్పాటు చేశారు. ఆర్టికల్ 370 రద్దుపై దాఖలైన పిటిషన్లపై అక్టోబర్ 1 నుంచి ఈ ధర్మాసనం వాదనలు విననుంది.
జమ్మూకాశ్మీర్కు ప్రత్యేక ప్రతిపత్తిని కల్పించే ఆర్టికల్ 370ని రద్దు చేస్తూ ఆగస్టులో కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. పార్లమెంటు ఉభయసభలు కూడా దీనికి ఆమోదం తెలిపాయి. 370 రద్దుతోపాటు రాష్ట్రాన్ని రెండు కేంద్ర పాలిత ప్రాంతాలుగా విభజిస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
అసెంబ్లీతో కూడిన కేంద్రపాలిత ప్రాంతంగా జమ్మూకాశ్మీర్ను, కేంద్ర పాలిత ప్రాంతంగా లడఖ్ను ఏర్పాటు చేసింది. ఈ మార్పుల కారణంగా రాష్ట్రంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జగరకుండా జమ్మూకాశ్మీర్ వ్యాప్తంగా ఆంక్షలు విధించింది. ప్రస్తుతం పరిస్థితులు సద్దుమణగడంతో పలు ప్రాంతాల్లో ఆంక్షలను ఎత్తివేసింది.