ఆపరేషన్ కమల: కాంగ్రెస్-జేడీఎస్ కూటమికి ఎమ్మెల్యేల షాక్: ముంబై నుంచి రామంటున్న ఎమ్మెల్యేలు
బెంగళూరు: బొటాబొటి మెజారిటీతో కాలం గడుపుతున్న కర్ణాటకలోని కాంగ్రెస్-జేడీఎస్ సంకీర్ణ ప్రభుత్వానికి కమలనాథుల నుంచి గండం తప్పేలా లేదు. సంకీర్ణ ప్రభుత్వానికి తమ నుంచి ఎలాంటి భయమూ లేదని అభయహస్తం ఇచ్చిన బీజేపీ చీఫ్ యడ్యూరప్ప అంతలోపే.. ఆపరేషన్ కమల-2ను కొనసాగించారు. ఆపరేషన్ కమల-1లో భాగంగా.. క్యాంపు రాజకీయాలకు మరోసారి శ్రీకారం చుట్టిన విషయం తెలిసిందే. తాజాగా- కాంగ్రెస్ కు చెంది నలుగురు ఎమ్మెల్యేలకు బీజేపీ గాలం వేసింది. బెంగళూరులో ఆరంభమైన అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు ఆ నలుగురూ ఎమ్మెల్యేలు కూడబలుక్కున్నట్టు గైర్హాజర్ అయ్యారు.
వారిలో ఇద్దరు ముంబైలోని రిసార్ట్ లోనే ఉన్నట్లు తెలుస్తోంది. ఆరోగ్య కారణాల వల్ల తాము ఇప్పట్లో బెంగళూరుకు రాలేమని వారు సమాచారం ఇచ్చారు. అనంతరం వారి మొబైల్ ఫోన్లు స్విచాఫ్ లో ఉన్నాయని కర్ణాటక కాంగ్రెస్ నాయకులు చెబుతున్నారు. ఇప్పటికే కాంగ్రెస్-జేడీఎస్ ప్రభుత్వానికి మద్దతు ఇచ్చిన ఇద్దరు స్వతంత్ర అభ్యర్థులను బీజేపీ తనవైపునకు లాక్కోగలిగింది.అంతంత మాత్రమే ఉన్న సంకీర్ణ ప్రభుత్వం నుంచి వైదొలగిన ఇద్దరు స్వతంత్రులు హై ఓల్టేజీ షాక్ ఇచ్చారు. ఇప్పుడు తాజా మరో ఇద్దరు గైర్హాజరు కావడం కాంగ్రెస్-జేడీఎస్ కూటమిని కుదిపేసింది. బుధవారం ప్యాలెస్ గ్రౌండ్స్ లో ఏర్పాటు చేసిన కాంగ్రెస్ సర్వసభ్య సమావేశానికి కూడా వారు హాజరు కాలేదని అంటున్నారు.
ఇదిలావుండగా- గురువారం కర్ణాటక అసెంబ్లీలో తీవ్ర దుమారం చెలరేగింది. ప్రభుత్వాన్ని అస్థిరపర్చడానికి బీజేపీ కుట్ర పన్నుతోందని అధికార పక్షం విరుచుకు పడగా.. అధికార పార్టీకి మెజారిటీ లేదని ప్రతిపక్ష బీజేపీ ఎదురుదాడికి దిగింది. మెజారిటీ లేని ప్రభుత్వం బడ్జెట్ ను ఎలా ప్రవేశపెడుతుందంటూ బీజేపీ నాయకులు నిలదీశారు. అధికార, ప్రతిపక్ష ఆరోపణలు, ప్రత్యారోపణలను కర్ణాటక అసెంబ్లీ స్తంభించిపోయింది. పరస్పరం దూషణలకు దిగారు. దీనితో గవర్నర్ వజూభాయ్ వాలా.. తన ప్రసంగాన్ని మధ్యలోనే ఆపేశారు.
224 అసెంబ్లీ స్థానాలు ఉన్న కర్ణాటకలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి కావాల్సిన మేజిక్ ఫిగర్ 112. బీజేపీకి 104 మంది సభ్యులు ఉండగా.. కాంగ్రెస్-జేడీఎస్ కూటమికి 117 మంది సభ్యుల బలం ఉంది. 117 మందిలో ఇద్దరు స్వతంత్రులు ఇదివరకే కూటమి నుంచి వైదొలిగారు. దీనితో అధికార కూటమి బలం 115కు పడిపోయింది. తాజాగా మరో ఇద్దరు ఎమ్మెల్యే గైర్హాజరు కావడంతో కుమారస్వామి ప్రభుత్వ కూసాలు కదిలే పరిస్థితి నెలకొంది. తమ ఎమ్మెల్యేలు ఎక్కడికీ పోలేదని, వారు తమతో టచ్ లోనే ఉన్నారని పీసీసీ అధ్యక్షుడు దినేష్ గుండూరావు చెబుతున్నారు.
వాస్తవ పరిస్థితి మాత్రం దీనికి భిన్నంగా ఉంది. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు రమేష్ జార్కిహోళి (గోకాక్), మహేష్ కుమటళ్లి (అథణి), బీ నాగేంద్ర (బళ్లారి రూరల్), ఉమేష్ జాదవ్ (చించోళి) పార్టీ నాయకులకు అందుబాటులో ఉండట్లేదు. వారిలో ఇద్దరు ఎమ్మెల్యేలు ముంబై రిసార్ట్ లో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ నలుగురూ సాయంత్రంలోగా అందుబాటులోకి రావాలని, లేకపోతే క్రమశిక్షణ చర్యలు తీసుకుంటామని గుండూరావు హెచ్చరించారు.
మరోవంక- బీజేపీకి చెందిన ముగ్గురు ఎమ్మెల్యేలు సభకు గైర్హాజరు కావడం ట్విస్ట్. బాలచంద్ర జార్కిహోళి, అరవింద లింబావళి, అశ్వర్థ నారాయణ సభకు గైర్హాజరయ్యారు. వారు ముగ్గురూ వ్యక్తిగత కారణాల వల్లే రాలేకపోయారని యడ్యూరప్ప వెల్లడించారు. అసంతృప్త ఎమ్మెల్యేగా గుర్తింపు పొందిన ఎంటీబీ నాగరాజును కాంగ్రెస్ పెద్దలు బుజ్జగించారు. దీనితో మెట్టుదిగిన ఆయన కుమారస్వామి తమ ముఖ్యమంత్రిగా అంగీకరిస్తున్నానని చెప్పారు.