13రోజులే: కానీ, ఎంపీగా సత్తా చాటుతున్న సచిన్
న్యూఢిల్లీ: క్రికెట్ దేవుడు సచిన్ టెండూల్కర్ అంతర్జాతీయ క్రికెట్కు వీడ్కోలు చెప్పకముందే రాజ్యసభ సభ్యుడిగా కొత్త బాధ్యతలు స్వీకరించిన సంగతి తెలిసిందే. యూపీఏ ప్రభుత్వం హయాంలో దేశ అత్యున్నత పురస్కారం భారతరత్న అందుకున్న అందుకోవడంతో పాటు పెద్దల సభగా ప్రసిద్ధికెక్కిన రాజ్యసభకూ నామినేట్ అయ్యాడు.
అయితే క్రికెట్పై ఉన్న ఆసక్తి సచిన్ టెండూల్కర్కు పార్లమెంట్పై లేదని పలువురు విమర్శలు చేశారు. అయితే తాజాగా వాటిని పటాపంచలు చేస్తూ సచిన్ రాజ్యసభ సభ్యుడిగానూ రికార్డులు నమోదు చేస్తున్నాడు. సచిన్ టెండూల్కర్ రాజ్యసభకు నామినేట్ అయిన తర్వాత ఇప్పటి వరకు 12 సార్లు పార్లమెంట్ సమావేశాలు జరిగాయి.
మొత్తం 235 రోజుల పాటు రాజ్యసభ జరిగితే, సచిన్ 13 రోజులు మాత్రమే హాజరయ్యాడు. 11వ సభ దాకా సభలో నోరు మెదపని సచిన్ టెండూల్కర్, 12 సభా సమావేశాల్లో (ప్రస్తుత సెషన్)లో మాత్రం తనదైన శైలిలో 7 ప్రశ్నలు సంధించాడు. అయితే ఈ ప్రశ్నలకు ప్రభుత్వం లిఖితపూర్వక సమాధానాలు ఇచ్చిన సమయంలో మాత్రం ఆయన సభలో లేకపోవడం గమనార్హం.
అంతేకాదు బీజేపీ ఎంపీ అనురాగ్ ఠాకూర్ నేతృత్వంలో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ విభాగానికి సంబంధించన స్టాండింగ్ కమిటీలో సచిన్ సభ్యుడిగా కూడా ఉన్నారు. ఈ కమిటీ నార్త్-ఈస్ట్లో పర్యటించిన ఐదు రోజుల పర్యటనకు కూడా సచిన్ హాజరవలేదు. ఈ సమయంలో రాజ్యసభలోని మిగతా ఎంపీలు సచిన్ సమావేశాలకు ఎందుకు హాజరుకావడం లేదంటూ ప్రశ్నించారు.
కాగా, సచిన్ టెండూల్కర్ మాత్రం రాజ్యసభ సభ్యుడిగా తనదైన దూసుకుపోతున్నాడు. తనకు కేటాయించిన ఎంపీల్యాడ్స్ నిధుల వినియోగంలో మాత్రం సచిన్ మిగిలిన వారికంటే మెరుగైన స్థితిలోనే ఉన్నాడు. ఇప్పటికే తన ఎంపీల్యాడ్స్ నిధుల్లో 98 శాతాన్ని ఖర్చు చేశాడు.
నిధుల కేటాయింపులోనూ అతడు తనదైన శైలిలో నిర్ణయాలు తీసుకుంటున్నాడు. తమిళనాడు వరద బాధితుల కోసం రూ.50 లక్షలు కేటాయించిన సచిన్, ఉత్తరాఖండ్ వరదల ద్వారా అక్కడి ఓ స్కూలు నిర్మాణంతో పాటు ఓ బ్రిడ్జికి నిధులు విడుదల చేసి చక్కని పనితీరుని కనబర్చాడు.
ప్రధాని నరేంద్రమోడీ ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన స్వచ్ఛభారత్ మిషన్కు బ్రాండ్ అంబాసిడర్గా కొనసాగుతున్నాడు. ఇక ఆంధ్రప్రదేశ్లోని నెల్లూరు జిల్లాలో పుత్తంరాజు కండ్రిగ గ్రామాన్ని దత్తత తీసుకున్న సచిన్ ఆ గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దారు. ఇలా రాజ్యసభకు నామినేట్ అయిన వారిలో నిధుల వినియోగంలో సత్తా చాటడమే కాక ప్రభుత్వాన్ని ప్రశ్నలు సంధించడంలో సచిన్ టెండూల్కర్ మెరుగైన రికార్డులే నమోదు చేశాడని సన్నిహితులు చెబుతున్నారు.