అబూసలేంకు చుక్కెదురు: పెళ్లికి పెరోల్ తిరస్కరించిన బాంబే హైకోర్టు
ముంబై: గ్యాంగ్స్టర్ అబూసలేంకు చుక్కెదురైంది. తన స్నేహితురాలిని పెళ్లి చేసుకోవడానికి పెరోల్ కోసం అబూసలేం చేసిన అభ్యర్థనను బాంబే హైకోర్టు తిరస్కరించింది. తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి వీకే తాహిల్రమణి, జస్టిస్ ఎంఎస్ సోనక్తో కూడిన ధర్మాసనం అతడి తరపు న్యాయవాది దాఖలు చేసిన పిటిషన్ను తోసిపుచ్చింది.
జైళ్ల చట్టాల ప్రకారం ఉగ్రవాద కార్యకలాపాల కింద అరెస్టై, శిక్ష అనుభవిస్తోన్న వ్యక్తికి పెరోల్ ఇవ్వడం కుదరదని కోర్టు స్పష్టం చేసింది. కాగా, అబూసలేం కొన్ని సంవత్సరాలుగా జైల్లో శిక్ష అనుభవిస్తున్నాడని, పెళ్లి చేసుకుంటానని ఓ మహిళకు ప్రమాణం చేశాడని సలేం తరఫు న్యాయవాది కోర్టుకు వెల్లడించారు.
అంతేగాక, శిక్ష అనుభవించేవారికి కూడా కుటుంబ జీవితాన్ని గడిపే హక్కు, సామాజిక సంబంధాలు నెరిపే హక్కు ఉంటుందని తన వాదనలు వినిపించారు. గతంలో వివిధ కేసుల్లో సుప్రీం ఇచ్చిన తీర్పులను ఈ సందర్భంగా ప్రస్తావించారు. కానీ, బాంబే కోర్టు మాత్రం పెరోల్ ఇవ్వడానికి అంగీకరించలేదు.
2005లో పోర్చుగల్ అబూసలేంను భారత్కు అప్పగించింది. అప్పటి నుంచి అతడు జైల్లోనే ఉంటున్నాడు. 2002లో ఓ వ్యాపార వేత్త నుంచి రూ.5కోట్లు డిమాండ్ చేసిన కేసుకు సంబంధించి ఢిల్లీలోని స్థానిక న్యాయస్థానం గత నెల అబూసలేంకు ఏడు సంవత్సరాల కఠిన కారాగార శిక్ష విధించింది. 1993లో ముంబైలో జరిగిన వరుస బాంబు పేలుళ్ల కేసులో దోషిగా తేలడంతో యావజ్జీవ కారాగార శిక్ష అనుభవిస్తున్నాడు. 1993 పేలుళ్లలో 257మంది ప్రాణాలు కోల్పోగా, 713మంది గాయాలపాలయ్యారు.