మోదీ ఇలాఖాలో ఏబీవీపీకి గట్టి షాక్.. చిత్తు చేసిన కాంగ్రెస్ విద్యార్థి విభాగం..
ప్రధాని నరేంద్ర మోదీ ఇలాఖా వారణాసిలో ఆర్ఎస్ఎస్ అనుబంధ విద్యార్థి సంఘం ఏబీవీపీకి గట్టి షాక్ తగిలింది. వారణాసిలోని సంపూర్ణానంద్ సంస్కృత విద్యాలయంలో జరిగిన విద్యార్థి సంఘం ఎన్నికల్లో మొత్తం నాలుగు స్థానాలను కాంగ్రెస్ అనుబంధ విద్యార్థి విభాగం ఎన్ఎస్యూఐ కైవసం చేసుకుంది. ఎన్ఎస్యూఐ విద్యార్థి నాయకుడు శివమ్ శుక్లా ఏబీవీపీ విద్యార్థి నేత హర్షిత్ పాండేని భారీ ఓట్ల తేడాతో ఓడించి విద్యార్థి సంఘం అధ్యక్షుడిగా ఎన్నికయ్యాడు. ఎన్ఎస్యూఐ విద్యార్థి నేత చందన్ కుమార్ ఉపాధ్యక్షుడిగా ఎన్నికయ్యాడు. అవనీష్ పాండే,రజనీకాంత్ దూబేలు జనరల్ సెక్రటరీ,లైబ్రేరియన్ పోస్టులకు ఎన్నికయ్యారు.
అధ్యక్షుడిగా ఎన్నికైన శివమ్ శుక్లాకు 709 ఓట్లు రాగా.. అతనిపై పోటీ చేసిన ఏబీవీపీ నేత హర్షిత్ పాండేకి 224 ఓట్లు మాత్రమే వచ్చాయి. ఉపాధ్యక్షుడిగా ఎన్నికైన చందన్ కుమార్కు మిశ్రాకు 553 ఓట్లు, జనరల్ సెక్రటరీగా ఎన్నికైన అవనీష్ పాండేకి 487ఓట్లు వచ్చాయి. ఇక లైబ్రేరియన్గా ఎన్నికైన అజయ్ కుమార్ మిశ్రాకు 482 ఓట్లు పోల్ అయ్యాయి. ఎన్నికల అధికారిగా వ్యవహరించిన యూనివర్సిటీ వైస్ చాన్సలర్ రాజారాం శుక్లా ఈ ఫలితాలను వెల్లడించారు. గెలిచిన విద్యార్థులు యూనివర్సిటీ క్యాంపస్లో ఎలాంటి ఊరేగింపులు,విజయోత్సవ ర్యాలీలు చేయవద్దని వీసీ శుక్లా సూచించారు. ఎన్నికల్లో మొత్తం 50.82శాతం ఓటింగ్ నమోదైనట్టు తెలిపారు.ఎన్నికల ఫలితాల తర్వాత.. గెలుపొందిన విద్యార్థులను పోలీస్ సెక్యూరిటీ నడుమ వారి ఇళ్లకు పంపించారు.
దేశవ్యాప్తంగా జాతీయ పౌరసత్వ పట్టిక(NRC),పౌరసత్వ సవరణ చట్టం(CAA)లకు వ్యతిరేకంగా నిరసనలు హోరెత్తుతున్న వేళ.. జేఎన్యూలో విద్యార్థులపై జరిగిన దాడిలో ఏబీవీపీపై ఆరోపణలు వినిపిస్తున్న వేళ.. మోదీ సొంత నియోజకవర్గంలోని సంస్కృత విద్యాలయంలో ఏబీవీపీ ఓటమి పాలవడం చర్చనీయాంశంగా మారింది. ఓటమిపై ఏబీవీపీ నేతల నుంచి ఇంకా ఎలాంటి స్పందన రాలేదని సమాచారం.