మోడీ నియోజకవర్గంలో బీజేపీకి ఊహించని దెబ్బ, అందుకే
ప్రధాని నరేంద్ర మోడీ ప్రాతినిథ్యం వహిస్తున్న వారణాసిలో బీజేపీకి (భారతీయ జనతా పార్టీ) ఊహించని షాక్ తగిలింది. మోడీ సొంత నియోజకవర్గంలో బీజేపీ అనుబంధ విద్యార్థి సంస్థ ఏబీవీపీ (అఖిల భారత విద్యార్థి పరిషత్)
వారణాసి: ప్రధాని నరేంద్ర మోడీ ప్రాతినిథ్యం వహిస్తున్న వారణాసిలో బీజేపీకి (భారతీయ జనతా పార్టీ) ఊహించని షాక్ తగిలింది. మోడీ సొంత నియోజకవర్గంలో బీజేపీ అనుబంధ విద్యార్థి సంస్థ ఏబీవీపీ (అఖిల భారత విద్యార్థి పరిషత్)కు చుక్కెదురైంది.
గెలిచిన స్వతంత్ర అభ్యర్థి
వారణాసిలోని మహాత్మా గాంధీ కాశీ విద్యాపీఠంలో విద్యార్థి సంఘం అధ్యక్ష ఎన్నికలు జరిగాయి. అధ్యక్ష ఎన్నికల్లో ఏబీవీపీ ఘోర పరాజయం పొందింది. స్వతంత్ర అభ్యర్థి భారీ మెజార్టీతో గెలుపొందారు.
ప్రతిష్టాత్మక విద్యాపీఠ్ వర్సిటీలో ఓటమి
మహాత్మా గాంధీ కాశీ విద్యాపీఠ్ యూనివర్సిటీ ఎన్నికలను విద్యార్థి సంఘాలు ప్రతిష్టాత్మకంగా భావిస్తాయి. ఈ దఫా జరిగిన ఎన్నికల్లో ఏబీవీపీ తరఫున వాల్మికీ ఉపాధ్యాయ బరిలోగి దిగారు. సమాజ్వాది ఛాత్ర సభ నుంచి రాహుల్ దుబే పోటీ చేయాల్సి ఉంది.
చివరి నిమిషంలో టిక్కెట్ రాకపోవడంతో
చివరి నిమిషంలో రాహుల్కు టిక్కెట్ ఇవ్వకపోవడంతో ఆయన స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేశారు. మొత్తం పోలైన ఓట్లలో దుబేకు 2,365 ఓట్లు రాగా, వాల్మీకికి 1,393 ఓట్లు వచ్చాయి. వెయ్యికి పైగా ఓట్లతో రాహుల్ దుబే విజయం సాధించాడు.
అందుకే ఏబీవీపీ ఓడింది
వాల్మీకిపై పలు ఆరోపణలు రావడం, రాహుల్ అనుచరులపై దాడి చేశాడన్న కేసు ఆయన ఓటమికి కారణమని విశ్లేషిస్తున్నారు. ఉపాధ్యక్ష పదవి, లైబ్రరీ సెక్రటరీ పదవులను గత ఏడాది అభ్యర్థులకే మద్దతు ఇచ్చి సమాజ్ వాది పార్టీ విభాగం, కాంగ్రెస్ పార్టీ విభాగం నిలుపుకున్నాయి. ఏబీవీపీ మాత్రం తన ఉన్న ఒక్క పదవిని కోల్పోయినట్లయింది. కాగా, యూపీలోనే బీమ్ రావ్ అంబేడ్కర్ యూనివర్సిటీ (ఆగ్రా)లో జరిగిన ఎన్నికల్లో ఏబీవీపీ సత్తా చాటింది.