మోడీ గాలి: ఢిల్లీ వర్సిటీ ఎన్నికల్లో ఎబివిపి స్వీప్
న్యూఢిల్లీ: ఢిల్లీ విశ్వవిద్యాలయం విద్యార్థి సంఘం ఎన్నికల్లో 18 ఏళ్ల తర్వాత బిజెపి అనుబంధ విద్యార్థి సంఘం అఖిల భారతీయ విద్యార్థి సంఘం (ఎబివిపి) స్వీప్ చేసింది. కాంగ్రెసు అనుబంధ విద్యార్థి సంఘం ఎన్ఎస్యుఐని ఓడించి ఎబివిపి నాలుగు హోదాలను కూడా కైవసం చేసుకుంది. ప్రధాని నరేంద్ర మోడీ హవా పనిచేసిందని ఎబివిపి నాయకులు అంటున్నారు.
అధ్యక్షుడిగా ఎబివిపికి చెందిన మోహిత్ నగర్ విజయం సాధించారు. ఆయనకు 20718 ఓట్లు రాగా, ఎన్ఎస్యుఐ అభ్యర్థికి 19804 ఓట్లు పోలయ్యాయి. ఎబివికి చెందిన పర్వేష్ కుమార్ ఉపాధ్యక్షుడిగా, కనిక షేకావత్ కార్యదర్శిగా విజయం సాధించారు.
ఎబివిపికి చెందిన ఆశుతోష్ మాథూర్కు అందరి కన్నా ఎక్కువ ఓట్లు వచ్చాయి. ఆయన సంయుక్త కార్యదర్శిగా విజయం సాధించారు. ఆయనకు 23133 ఓట్లు వచ్చాయి. మోడీ ప్రభుత్వం అధికారంలోకి రావడంతో ప్రజల అంచనాలు పెరిగాయని, మోడీ హవాతోనే తాము విజయం సాధించామని ఎబివిపి జాతీయ కార్యదర్శి రోహిత్ చాహల్ అన్నారు.
విజయం సాధించిన ఎబివిపిని బిజెపి జాతీయాధ్యక్షుడు అమిత్ షా ట్విట్టర్లో అభినందించారు. ఢిల్లీ విశ్వవిద్యాలయం ఎన్నికల్లో నాలుగు ప్రధాన పదవులను దక్కించుకున్న ఎబివిపిని అభినందిస్తూ ఆయన ట్వీట్ చేశారు.