ప్రభుత్వానికి కుచ్చుటోపీ, టీడీఆర్ స్కాంలో వాల్ మార్క్ కంపెనీకి ఏసీబీ షాక్, సోదాలు, దిమ్మ తిరిగింది !
బెంగళూరు: అభివృద్ది హక్కు బదిలి (టీడీఆర్) విషయంలో ప్రభుత్వానికి కుచ్చుటోపీ పెట్టారని ఆరోపిస్తూ శనివారం బెంగళూరులో ఏసీబీ అధికారులు ఐదు ప్రాంతాల్లో దాడులు చేశారు. ప్రభుత్వాన్ని మోసం చేశారని ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యాపారుల నివాసాలు, కార్యాలయాల్లో ఏసీబీ అధికారులు సోదాలు చేస్తున్నారు.
ప్రభుత్వానికి కుచ్చుటోపీ పెట్టారని ఆరోపణలు ఎదుర్కొంటున్న రతన్ లాల్, అమిత్ బోళార్, గౌతమ్, మునిరాజప్ప తదితరుల నివాసాలు, కార్యాలయాల్లో ఏకకాలంలో సోదాలు జరుగుతున్నాయి. బృహత్ బెంగళూరు మహానగర పాలికె (బీబీఎంపీ), బీడీఏ నుంచి వాల్ మార్క్ కంపెనీ అక్రమంగా టీడీఆర్ తీసుకుందని ఆరోపణలు ఉన్నాయి.
ఈ విషంపై వాల్ మార్క్ కంపెనీ యజమాని రతన్ లాల్ కార్యాలయం, నివాసంలో ఏసీబీకి చెందిన ఎస్పీ, ఏసీపీ, డీఎస్పీలు సోదాలు చేస్తున్నారు. ఇందిరానగర, కేఆర్ పురంలోని వాల్ మార్క్ కంపెనీల కార్యాలయాల్లో ఏసీబీ అధికారులు శనివారం సోదాలు చేస్తున్నారు.
బెంగళూరు నగరంలోని రెసిడెన్సీ రోడ్డులోని రతన్ లాల్ నివాసంలో, హెచ్ఏఎల్ సమీపంలోని ప్రత్యేక కార్యాలయంలో సోదాలు చేస్తున్నారు. వాల్ మార్క్ కంపెనీ నుంచి ప్రభుత్వానికి ఎంత నష్టం జరిగింది ? అంటూ అధికారులు ఆరా తీస్తున్నారు. తప్పుడు పత్రాలతో ప్రభుత్వాన్ని వాల్ మార్క్ కంపెనీ మోసం చేసిందని ఆరోపణలు ఉన్నాయి.