రైలు ప్రమాదంలో సహాయక చర్యలు వేగవంతం.. హెల్ప్ లైన్లు ఏర్పాట్లు
పాట్నా : బీహార్ లో ఆదివారం తెల్లవారుజామున జరిగిన ఘోర రైలు ప్రమాదానికి సంబంధించి రైల్వేశాఖ అప్రమత్తమైంది. బాధితులకు సహాయార్థం హెల్ప్ లైన్లు ఏర్పాటు చేసింది. ఎన్టీఆర్ఎస్ దళాలు కూడా సహాయకచర్యల్లో నిమగ్నమయ్యాయి. గాయపడ్డవారిని సమీప ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నట్లుగా తెలుస్తోంది.
సీమాంచల్ ఎక్స్ప్రెస్ రైలు పట్టాలు తప్పడంతో ఆరుగురు మృత్యువాత పడ్డారు. జోగ్బని నుంచి ఢిల్లీ వెళుతుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. పదుల సంఖ్యలో తీవ్రంగా గాయపడ్డారు. వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.
Railways would give ex-gratia of Rs 5 lakh each to the kin of every deceased. Rs 1 lakh would be given to the grievously injured and Rs 50,000 to those who suffered simple injuries. All medical expenses will also be born by Railways #SeemachalExpress
— Piyush Goyal Office (@PiyushGoyalOffc) February 3, 2019
హెల్ప్ లైన్లు ఏర్పాటు
రైలు ప్రమాదం విషయం తెలియగానే సహాయక బృందాలు వేగంగా స్పందించాయి. ఘటనాస్థలికి చేరుకుని బోగీల్లో చిక్కుకున్నవారిని రక్షించే ప్రయత్నం చేశారు. గాయపడ్డవారిని సమీప ఆసుపత్రులకు తరలించారు. బాధితులకు సహాయంగా రైల్వేశాఖ హెల్ప్ లైన్లు ఏర్పాటు చేసింది. సోన్పూర్ లో 06158221645, హజీపూర్ లో 06224272230, బరౌనీలో 06279232222 నంబర్లను అందుబాటులో ఉంచారు. మరోవైపు మృతుల సంఖ్య పెరిగి అవకాశమున్నట్లు తెలుస్తోంది. ప్రమాద స్థలంలో సహాయకచర్యలు స్పీడప్ చేశారు రైల్వే అధికారులు.
సహాయకచర్యలు ముమ్మరం
ప్రమాదానికి సంబంధించి కేంద్ర రైల్వే శాఖ మంత్రి పీయూష్ గోయల్ ట్విట్టర్ వేదికగా స్పందించారు. జోగ్బని - ఢిల్లీ ఆనంద్ విహార్ టర్మినల్ మధ్య నడిచే సీమాంచల్ ఎక్స్ప్రెస్ రైలు.. షహదాయ్ బుజుర్గ్ దగ్గర ప్రమాదానికి గురైనట్లు తెలిపారు. 9 బోగీలు పట్టాలు తప్పినట్లు ప్రకటించారు. సహాయకచర్యలు కొనసాగుతున్నట్లు ట్వీట్ చేశారు.ప్రమాదంలో చనిపోయినవారి కుటుంబాలకు 5 లక్షల రూపాయల ఎక్స్ గ్రేషియా ఇస్తామని తెలిపారు మంత్రి. తీవ్రంగా గాయపడ్డవారికి లక్ష రూపాయలు, స్వల్పంగా గాయపడ్డవారికి 50వేల రూపాయల ఆర్థికసాయం అందిస్తామన్నారు.
3 స్లీపర్ కోచులు (S8, S9, S10), ఒక ఏసీ కోచ్, ఒక జనరల్ బోగీతో పాటు మొత్తం 9 బోగీలు పట్టాలు తప్పాయి. 3 బోగీలు ఒకదానిపై ఒకటి పడిపోవడంతో ప్రమాద తీవ్రత ఎక్కువ ఉన్నట్లు తెలుస్తోంది. ప్రమాదం జరిగిన వెంటనే ఎన్డీఆర్ఎఫ్ దళాలు వేగంగా ఘటనాస్థలికి చేరుకుని సహాయకచర్యల్లో నిమగ్నమయ్యారు.
బీహార్ సీఎం దిగ్భ్రాంతి
జోగ్బని నుంచి ఢిల్లీ వెళుతున్న సీమాంచల్ ఎక్స్ప్రెస్ వైశాలి జిల్లాలోని షహదాయ్ బుజుర్గ్ దగ్గర పట్టాలు తప్పింది. తెల్లవారుజామున 3.50 నుంచి 3.58 మధ్య ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. పాట్నాకు 30 కిలోమీటర్ల దూరంలో ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. సీమాంచల్ రైలు ప్రమాదంపై బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. సహాయకచర్యలు వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు.