విలాసాలు: ఫ్రెండ్ ఇంట్లో మహిళా టెక్కీ దొంగతనాలు
బెంగళూరు: విలాసాలకు అలవాటు పడిన ఓ మహిళ టెక్కీ దొంగగా మారింది. అదనపు ఖర్చుల కోసం స్నేహితుల ఇళ్లల్లో దొంగతనాలకు పాల్పడింది. చివరకు పోలీసులకు చిక్కి కటకటాలపాలైంది. ఈ ఘటన కర్ణాటక రాష్ట్రంలోని బెంగళూరులో జరిగింది. ఆమెను అరెస్ట్ చేసిన హెన్నూరు పోలీసులు, జైలుకు తరలించారు.
బెంగళూరు నగర పోలీస్ కమిషనర్ రాఘవేంద్ర ఔరాద్కర్ కథనం ప్రకారం.. నిందితురాలు ఎలిజబెత్ అలియాస్ మేరీ(22) గోవిందశెట్టిపాళ్యలో నివాసముంటూ.. బెంగళూరులోని యాక్సెంచర్ కంపెనీలో సాఫ్ట్వేర్ డెవలపర్గా పని చేస్తోంది. నాలుగు నెలలుగా పలుమార్లు హెన్నూరులోని తన స్నేహిరాలు పూజాశర్మ ఇంటికి వెళ్లింది.
ఆ సమయంలో పూజాశర్మ కుటుంబ సభ్యుల కళ్లుగప్పి బంగారు నగలు, విలువైన వస్తువులను తన వ్యానిటీ బ్యాగులో వేసుకుని గుట్టుచప్పుడు కాకుండా దొంగతనం చేసింది. పదే పదే ఇంటిలో నగలు చోరీ అవుతుండటంతో పూజాశర్మ కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు దర్యాప్తు మొదలుపెట్టారు. పూజాశర్మ ఇంట్లో పని చేస్తున్న వారిని ప్రశ్నించి.. దొంగతనంలో వారి ప్రమేయం లేదని నిర్ధారణకు వచ్చారు.
ఆ తర్వాత నాలుగు నెలల నుంచి పూజాశర్మ ఇంటికి వచ్చి వెళ్లిన వారిపై పోలీసులు గట్టి నిఘా ఏర్పాటు చేశారు. ఎలిజబెత్ వైఖరిపై అనుమానం కలగడంతో ఆమె గురించి వాకబు చేశారు. ఎలిజబెత్ తండ్రికి భారీగా అప్పులున్నాయనీ, అయినా ఎలిజబెత్ మాత్రం విలాసవంతమైన జీవనం గడుపుతోందని గుర్తించారు. ఆమెను అదుపులోకి తీసుకుని తమదైన శైలిలో విచారించగా అసలు విషయం బయటికి వచ్చింది.