డ్రగ్స్ సేవించిన కన్నడ సినీ హీరోలు, ఆంధ్రా మాజీ ఎంపీ మనమడు, బెంగళూరులో రచ్చరచ్చ !
బెంగళూరు: కన్నడ సినీనటులు ఇద్దరు, ఆంధ్రప్రదేశ్ కు చెందిన మాజీ ఎంపీ, ప్రముఖ వ్యాపారవేత్త మనమడు కలిసి డ్రగ్స్ సేవించి నాలుగు వాహనాలు, ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర ఏర్పాటు చేసిన బోర్డును ఢీకొని రచ్చరచ్చ చేసిన ఘటన బెంగళూరు నగరంలో జరిగింది. స్థానికులు చితకబాదడానికి ప్రయత్నిస్తే ముగ్గురు పరారైనారు.
బెంగళూరు నగరంలోని సౌత్ ఎండ్ సర్కిల్ సమీపంలో బుధవారం రాత్రి విలాసంవతమైన కారు నిలిపి ముగ్గురు డ్రగ్స్ సేవిస్తున్న విషయం స్థానికులు గుర్తించారు. రాత్రి పోద్దుపోయిన తరువాత ముగ్గురు కలిసి కారులో బయలుదేరారు. సౌత్ ఎండ్ సర్కిల్ సమీపంలో వాహనం వేగంగా నడిపారు.
ఆ సందర్బంలో డ్రగ్స్ మత్తులో కారును ఇష్టం వచ్చినట్లు నడపడంతో మారుతి ఓమ్ని కారుతో పాటు రెండు కార్లు, ఓ జీపును ఢీకొన్నారు. తరువాత ట్రాఫిక్ సిగ్నల్ సమీపంలో ఏర్పాటు చేసిన బోర్డును కారు ఢీకొనింది. ఈ ప్రమాదంలో మారుతి ఓమ్ని కారు పల్టీ కొట్టింది.
విషయం గుర్తించిన స్థానికులు డ్రగ్స్ సేవించి వాహనం నడిపిన వారికి దేహశుద్ది చెయ్యడానికి ప్రయత్నించారు. ఆ సందర్బంలో డ్రగ్స్ సేవించి వరుస ప్రమాదాలకు కారణం అయిన ముగ్గురు ఖరీదైన కారు అక్కడే వదిలి పెట్టి పరుగు తీశారని స్థానికులు చెప్పారు.
ఈ ప్రమాదంలో మారుతి ఓమ్ని కారులో ఉన్న వ్యక్తికి తీవ్రగాయాలు కావడంతో అతన్ని సాగర్ ఆసుపత్రికి తరలించారు. డ్రగ్స్ సేవించిన వారిలో ఇద్దరు కన్నడీ సినీ హీరోలు, ఆంధ్రప్రదేశ్ కు చెందిన మాజీ ఎంపీ, ప్రముఖ వ్యాపారవేత్త మనమడు ఉన్నాడని స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కారు స్వాధీనం చేసుకుని విచారణ చేస్తున్నామని పోలీసులు తెలిపారు.