చీఫ్ సెక్రటరీపై దాడి: లొంగిపోయిన ఆప్ ఎమ్మెల్యే, స్తంభించిన పాలన..
న్యూఢిల్లీ: సీఎం నివాసంలో చీఫ్ సెక్రటరీ అన్షు ప్రకాష్పై దాడి చేశారన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆమ్ ఆద్మీ పార్టీ ఎమ్మెల్యే అమానతుల్లా ఖాన్ పోలీసుల ఎదుట లొంగిపోయారు. బుధవారం ఉదయం జామియా పోలీస్ స్టేషన్లో ఆయన లొంగిపోయారు.
ఇదే కేసులో మంగళవారం రాత్రి ఆప్ ఎమ్మెల్యే ప్రకాష్ జర్వాల్ అరెస్టయిన సంగతి తెలిసిందే. ప్రకాష్ జర్వాల్, అమానతుల్లా ఖాన్ ఇద్దరూ సీఎం ఎదుటే తనపై దాడి చేశారని చీఫ్ సెక్రటరీ అన్షు ప్రకాష్ ఆరోపిస్తున్నారు. ఈ మేరకు ఆయన కేసు ఫైల్ చేయడంతో పోలీసులు చర్యలు ప్రారంభించారు.
Alleged assault of Delhi Chief Secy: AAP MLA Amanatullah Khan reaches Jamia Nagar Police Station, says that he has come to surrender, also added that, 'I have not done anything wrong.' pic.twitter.com/enQIO7CKSM
— ANI (@ANI) February 21, 2018
ఇద్దరు ఎమ్మెల్యేలపై 120బి(నేరపూరిత కుట్ర), 186(ప్రభుత్వ అధికారి విధులకు ఆటంకం కలిగించడం), 323(ఉద్దేశపూర్వక దాడి), 342, 504,506(బి),120బి,34&353(ప్రభుత్వ అధికారిపై దాడి) కింద కేసులు నమోదు చేశారు పోలీసులు.
కాగా, పోలీసుల ఎదుట లొంగిపోయిన సందర్భంగా అమానతుల్లా ఖాన్ మీడియాతో మాట్లాడారు. 'ప్రజలకు రేషన్ సరిగా అందడం లేదని ఎమ్మెల్యేలం ఆందోళన చెందుతున్నాం. గత నెలలో 2.5లక్షల మందికి రేషన్ అందలేదు. ఇదే విషయాన్ని సీఎం దృష్టికి తీసుకెళ్తే.. ఆయన ఉన్నతాధికారులతో సమావేశం నిర్వహించారు' అని చెప్పారు.
ప్రభుత్వ ప్రణాళికలపై చర్చించడానికి సీఎం కేజ్రీవాల్ తన నివాసానికి పిలిచారని.. దానిపై చర్చ జరుగుతుండగా ఎమ్మెల్యేలు తనపై దాడి చేశారని చీఫ్ సెక్రటరీ అన్షు ప్రకాష్ ఆరోపిస్తున్నారు. ఆమ్ ఆద్మీ పార్టీ మాత్రం ఈ ఆరోపణలను ఖండిస్తోంది.
తాజాగా ఆమ్ ఆద్మీ పార్టీ నేత సంజయ్ సింగ్ దీనిపై స్పందించారు. దేశంలో ఏ పెద్ద సంఘటన జరిగినా.. వెంటనే ఆమ్ ఆద్మీ టార్గెట్ చేయబడుతుందని ఆయన ఆరోపించారు. ఇదంతా పక్కా ప్లాన్తో జరిగిన కుట్ర అని, తమ పార్టీని దెబ్బతీయడానికే ఇలాంటివి చేస్తున్నారని ఆరోపించారు.
ఇదిలా ఉంటే, చీఫ్ సెక్రటరీపై దాడితో ఐఏఎస్లంతా ఏకమయ్యారు. ఎమ్మెల్యేల తీరును నిరసిస్తూ నిన్నటి నుంచి విధులను బహిష్కరించారు. దీంతో న్యూఢిల్లీలో పాలన మొత్తం స్తంభించిపోయింది.