మోడీ సర్కార్కు మరో ఎదరుదెబ్బ: ఆ కార్యకర్తకు ముందస్తు బెయిల్
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా అమలు చేయడానికి ఉద్దేశించిన మూడు వ్యవసాయ చట్టాలను నిరసిస్తూ సుదీర్ఘకాలం పాటు కొనసాగుతోన్న రైతుల ఆందోళనలు, నిరసనల వ్యవహారంలో కేంద్ర ప్రభుత్వానికి మరో ఎదురుదెబ్బ తగిలింది. రైతు ఉద్యమానికి మద్దతుగా గ్రెటా థెన్బర్గ్ ట్వీట్ చేసిన టూల్కిట్ వ్యవహారంలో మరొకరికి ఢిల్లీ న్యాయస్థానం ముందస్తు బెయిల్ను మంజూరు చేసింది. ఇప్పటికే టూల్కిట్ కేసులో సామాజిక కార్యకర్త దిశ రవికి బెయిల్ లభించింది. తాజాగా పర్యావరణ కార్యకర్త శంతను ములుక్కు ఢిల్లీ న్యాయస్థానం ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. ఆయనను వచ్చేనెల 9వ తేదీ వరకు అరెస్ట్ చేయొద్దని ఢిల్లీ పోలీసులను ఆదేశించింది.
శంతను ములుక్ ముందస్తు బెయిల్ పిటిషన్పై లోతైన నివేదికను దాఖలు చేయడానికి మరింత సమయం కావాల్సి ఉందని ఢిల్లీ పోలీసులు న్యాయస్థానానికి కోరారు. దీనితో ఢిల్లీ కోర్టు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. మార్చి 9వ తేదీ వరకు ఆయనపై ఎటువంటి చర్యలు తీసుకోకూడదని అదనపు సెషన్స్ జడ్జి ధర్మేంద్ర రాణా ఢిల్లీ పోలీసులను ఆదేశించారు. రైతు ఉద్యమానికి మద్దతుగా టూల్కిట్లో మార్పులు చేశారని ఆరోపణలను శంతను ములుక్ ఎదుర్కొంటున్నారు. ఇదే కేసులో దిశారవి, నికితా జాకబ్పై కేంద్రం పలు కేసులు నమోదు చేసిన సంగతి తెలిసిందే.
గతంలో ములుక్కు బాంబే హైకోర్టు ఈనెల 16న పదిరోజుల వరకు ట్రాన్సిట్ బెయిల్ మంజూరు చేసింది. పర్యావరణ కార్యకర్త దిశారవి, శంతన్ ములుక్లతో పాటు మరో కార్యకర్త నికితా జాకబ్లపై కేంద్రం దేశద్రోహం, ఇతర ఆరోపణలపై కేసులు నమోదయ్యాయి. బెంగళూరుకు చెందిన దిశరవికి ఖలిస్థానీ ఉద్యమంతో సంబంధం ఉందనే కారణంతో ఢిల్లీ పోలీసులు అరెస్ట్ చేశారు. జనవరి 26వ తేదీన దేశ రాజధానిలో చోటు చేసుకున్న అల్లర్లకు పాల్పడిన వారితో ఖలిస్థానీ పీజేఎఫ్ లేదా దిశరవికి సంబంధాలున్నట్లు సాక్ష్యాధారాలను ఢిల్లీ పోలీసులు ప్రొడ్యూస్ చేయలేకపోయారు. దీనితో ఆమెకు బెయిల్ లభించింది. తాజాగా- శంతను ములుక్కు ముందస్తు బెయిల్ మంజూరైంది.