ఇంట్లో ఎప్పుడూ కొట్టుకోవడమే!: 'ప్రద్యుమన్ హత్య'లో నిందితుడు బయటపెట్టిన సంచలన విషయాలు
అతనెప్పుడూ హింసాత్మకంగా ప్రవర్తించేవాడని, సెల్ఫోన్లో వీడియోలు చూస్తూ అల్లరిగా తిరిగేవాడని చెబుతున్నారు.
న్యూఢిల్లీ: రియన్ స్కూల్ ప్రద్యుమన్ హత్యోదంతంలో నిందితుడైన మైనర్ సీబీఐ విచారణలో పలు ఆసక్తికర విషయాలు వెల్లడించాడు. కోర్టు అనుమతి మేరకు సీబీఐ అతన్ని కస్టడీలోకి తీసుకుని విచారిస్తోంది.
గత మంగళవారం రాత్రి 11గం. సమయంలో నిందితుడిని సీబీఐ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. హత్యకు దారితీసిన పరిస్థితులు?, తానెందుకలా మారాల్సి వచ్చింది? అన్న ప్రశ్నలకు అధికారులు వివరాలు రాబడుతున్నారు.
తక్కువ మార్కులొస్తే:
ఇంటర్నల్ పరీక్షల్లో తక్కువ మార్కులు వస్తే ఇంట్లోవాళ్లు తిడుతారన్న కారణంతోనే తాను హత్యకు పాల్పడినట్టు నిందితుడు తెలిపాడు. పరీక్షలు వాయిదా వేయడం కోసమే అలా చేశానని చెప్పాడు. ఎందుకు తక్కువ మార్కులు వస్తాయని ప్రశ్నించగా.. విస్మయపరిచే విషయాలు వెల్లడించాడు.
అమ్మ-నాన్న ఎప్పుడూ కొట్లాడుకుంటూ
తన ఇంట్లో వాతావరణం ఎప్పుడూ ప్రశాంతంగా ఉండదని నిందితుడు పేర్కొనడం గమనార్హం. అమ్మ-నాన్న ఎప్పుడూ కొట్లాడుకుంటూ ఉంటారని, అందుకే తనకు చదువు మీద ఆసక్తి తగ్గిపోయిందని తెలిపినట్టు సీబీఐ వర్గాలు వెల్లడించాయి.
సామాజిక విచారణ నివేదిక:
ప్రద్యుమన్ హత్య కేసు విచారణలో భాగంగా జిల్లా బాలల భద్రతా విభాగం అధికారులు నిందితుడి తల్లిదండ్రులు, పొరుగువారు, నిందితుడి స్నేహితులను కూడా ప్రశ్నించనున్నారు. 'సామాజిక విచారణ నివేదిక'ను తయారుచేయడంలో భాగంగా వీరిందరిని ప్రశ్నించనున్నారు.
హింసాత్మక ప్రవర్తన:
నిందితుడి గురించి తోటి విద్యార్థులు పలు విషయాలు వెల్లడించారు. అతనెప్పుడూ హింసాత్మకంగా ప్రవర్తించేవాడని, సెల్ఫోన్లో వీడియోలు చూస్తూ అల్లరిగా తిరిగేవాడని చెబుతున్నారు. నిందితుడిని విచారించిన సీబీఐ.. కస్టడీ పొడగింపు కోరలేదు. దీంతో ఈ నెల 22వరకు అతన్ని ఫరీదాబాద్ అబ్జర్వేషన్ హోమ్లో ఉంచాలని బాలల న్యాయస్థానం ఆదేశించినట్టు సమాచారం.