నిర్భయ దోషులను ఉరితీస్తా.. అమిత్ షాకు లేడీ షూటర్ నెత్తుటి లేఖ
''సార్.. నిర్భయ కేసులో దోషులుగా తేలిన నలుగురు నీచుల్ని ఉరితీసే బాధ్యత నాకు అప్పగించండి..'' అంటూ ప్రముఖ షూటర్ వర్తికా సింగ్ తన రక్తంతో కేంద్ర హోం మంత్రి అమిత్ షాకు లెటర్ రాశారు. మహిళల్ని దారుణంగా చంపే మృగాళ్లకు మహిళల చేతుల్లో చావు తప్పదన్న సందేశం దేశానికివ్వాలని ఆమె సూచించారు. ఈమేరకు తాను రాసిన లేఖతో ఢిల్లీలోని కేంద్ర ప్రభుత్వ సెక్రటేరియట్ బిల్డింగ్ కు వచ్చిన ఆమె.. మీడియాతో మాట్లాడారు.
నా బిడ్డ బతికి లేకపోవడం సంతోషం.. ఆ మృగాళ్లను చూసినప్పుడల్లా చస్తున్నా.. నిర్భయ తల్లి కంటతడి
ఉరి తీసే అవకాశమివ్వండి..
‘‘నిర్భయ దోషుల్ని నా చేతులతో ఉరి తీసే అవకాశమివ్వండి. మహిళ కూడా ఉరిశిక్షను అమలు చేయగలదన్న సందేశం అందరికీ చేరాలి. మహిళా నటీమణులు, ఎంపీలు నా డిమాండ్ ను సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను. తద్వారా సమాజంలో కొంతైనా మార్పు వస్తుందని ఆశిస్తున్నా..‘‘ అని వర్తికా సింగ్ లేఖలో పేర్కొన్నారు.
హైదరాబాద్ లో దిశ ఘటన
హైదరాబాద్ లో దిశ ఘటన తర్వాత దేశవ్యాప్తంగా మహిళలపై అత్యాచారం కేసుల్లో వేగం పెరగడం, ఈక్రమంలోనే ఏడేండ్లుగా నానుతూ వస్తున్న నిర్భయ దోషుల ఉరిశిక్ష ప్రక్రియపై కదలిక రావడం తెలిసిందే. ప్రస్తుతం తిహార్ జైలులో ఉన్న నలుగురు నిందితుల్ని ఉరి తీసేందుకు తాళ్లు, తలారీని పంపాలంటూ జైలు అధికారులు.. ఉత్తరప్రదేశ్, బీహార్ ప్రభుత్వాలకు లేఖలు రాశారు. ఉరిశిక్షను అమలు చేసే బాధ్యత తనకివ్వాలని ఓ మహిళ డిమాండ్ చేయడం ఇదే తొలిసారి.
17, 18 తేదీల్లో కీలక విచారణలు
నిర్భయ దోషుల ఉరి శిక్ష అమలుకు సంబంధించి వచ్చే రెండ్రోజుల్లో కీలక విచారణ జరుగనుంది. ఉరిశిక్షను జీవితఖైదుగా మార్చాలంటూ నలుగురు నిందితుల్లో ఒకడైన అక్షయ్ సింగ్ వేసిన పిటిషన్ ను సుప్రీంకోర్టు మంగళవారం విచారించనుంది. సుప్రీం ఆదేశాలను బట్టి.. నిర్భయ తల్లి ఆశాదేవి దాఖలు చేసిన ఇంప్లీడ్ పిటిషన్ పై ఢిల్లీ హైకోర్టు బుధవారం నిర్ణయం తీసుకోనుంది.
మరో నిందితుడు వినయ్ యూటర్న్
నిర్భయ దోషులకు క్షమాభిక్ష ప్రసాదించొద్దంటూ కేంద్ర హోం శాఖ.. రాష్ట్రపతికి సూచించడాన్ని సవాలు చేస్తూ దోషుల్లో ఒకడైన వినయ్ శర్మ దాఖలు చేసిన పిటిషన్ పై గందరగోళం నెలకొంది. సదరు పిటిషన్ పై తాను సంతకం చేయలేదని, తన పేరుతో దాఖలైన పిటిషన్ ను వెంటనే ఉపసంహరించాలని వినయ్ రాష్ట్రపతిని కోరాడు.
నిర్భయ ఘటనకు ఏడేండ్లు నిండాయి..
దేశాన్ని గగుర్పాటుకు గురిచేసిన నిర్భయ ఘటనకు నేటి(డిసెంబర్ 16) తో సరిగ్గా ఏడేండ్లు నిండాయి. 2012లో ఇదేరోజు ఢిల్లీలో ఆరుగురు కీచకులు నిర్భయను దారుణంగా రేప్ చేసి గాయపర్చడంతో డిసెంబర్ 21న ఆమె కన్నుమూసింది. ఏండ్లు గడుస్తున్నా నిర్భయకు న్యాయం దక్కలేదని ఆమె కుటుంబీకులతోపాటు యావత్ దేశం నిననిదిస్తున్నది.