కేరళ మాజీ సీఎంకు అస్వస్థత.. ఆస్పత్రికి తరలింపు...
కేరళ మాజీ సీఎం, సీపీఎం సీనియర్ నేత వీఎస్ అచ్యుతానందన్ అస్వస్థతకు గురయ్యారు. వెంటనే ఆయనను సమీపంలోని ఆస్పత్రిలో చేర్చారు. రక్తపోటు ఎక్కువ కావడంతో హాస్పిటల్లో చేర్చినట్టు పార్టీ వర్గాలు మీడియాకు తెలిపాయి. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉన్నట్టు విశ్వసనీయంగా తెలిసింది. కానీ అధికారికంగా వైద్యులు గానీ, అధికారులు మాత్రం ధ్రువీకరించలేదు.
వీఎస్ అచ్యుతానందన్ కేరళ సీఎంగా పనిచేశారు. సీపీఎం కురువృద్ద నేత. కమ్యూనిస్ట్ భావజాలం మెండుగా ఉన్న నేత. ఏడుసార్లు అసెంబ్లీకి ఎన్నికై రికార్డు సృష్టించారు. ప్రస్తుతం మల్లంపూజా నియోజకవర్గం నుంచి అచ్యుతానందన్ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అచ్యుతానందన్ ఆరోగ్య పరిస్థితి తెలుసుకొని సీపీఎం నేతలు ఆస్పత్రి వద్ద గుమిగూడారు. ఆరోగ్య పరిస్థితి బానే ఉందని చెప్పినా.. ఆందోళనకు గురయ్యారు. ఆస్పత్రి వద్ద భారీగా పోలీసు బలగాలను మొహరించారు.
అచ్యుతానందన్ అనారోగ్యం గురించి సీఎం పినరయి విజయన్ వాకబు చేశారు. స్వయంగా ఆస్పత్రికి వెళ్లి మరీ ఆయనను పరామర్శించారు. వైద్యులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. మెరుగైన వైద్యం అందజేయాలని ఆదేశాలు జారీచేశారు. అచ్యుతానందన్ ఆరోగ్య పరిస్థితి ప్రస్తుతం స్థిమితంగానే ఉందని వైద్యులు చెప్పినట్టు తెలుస్తోంది. కానీ అధికారికంగా హెల్త్ బులెటిన్ మాత్రం విడుదల చేయాల్సి ఉంది.