భార్యాభర్తలకు షాక్.. యాసిడ్ దాడి కేసు.. సంచలన తీర్పు..!
ఢిల్లీ : ఢిల్లీ కోర్టు సంచలన తీర్పు వెలువరించింది. మూడేళ్ల కిందట జరిగిన యాసిడ్ దాడి కేసులో భార్యాభర్తలకు 11 ఏళ్ల జైలుశిక్ష ఖరారు చేస్తూ తీర్పు చెప్పింది. అంతేకాదు బాధితురాలికి చెరో లక్ష రూపాయలు జరిమానా చెల్లించాలంటూ ఆదేశించింది. కోర్టు తీర్పుతో పలువురు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
23 సంవత్సరాల రాధే అనే యువకుడికి అనిత అనే మహిళతో వివాహమైంది. అయితే 2015లో హరిద్వార్ ఏరియాలోని కన్వార్ యాత్రకు వెళ్లాడు. ఆ క్రమంలో హరిద్వార్కు తండ్రితో వచ్చిన 20 ఏళ్ల యువతి మీనాక్షి దారి తప్పింది. తండ్రి, ఆమె చెరో దారి అయ్యారు. ఆ క్రమంలో రాధే ఆమెకు తారసపడ్డాడు. విషయం తెలుసుకుని ఆమెకు సాయం చేశాడు. మీనాక్షిని తండ్రి దగ్గరకు చేర్చాడు. ఆ సమయంలో వారి ఫోన్ నెంబర్ తీసుకుని దగ్గరయ్యాడు.
పెద్ద సారుకు చెప్పు దెబ్బ.. లైంగికంగా వేధించాడని చెంప చెళ్లు..!
కొన్ని రోజుల తర్వాత తనను పెళ్లి చేసుకోవాలంటూ వత్తిడి తెచ్చాడు. తన భార్య అనితకు కూడా రెండో పెళ్లి సమ్మతమేనంటూ నచ్చజెప్పాడు. అయితే మీనాక్షి పెళ్లికి నిరాకరించడంతో పాటు ఆ ఇద్దరి భార్యాభర్తల గురించి ఆరా తీసింది. వాళ్లు అక్రమ మార్గంలో మాంసం విక్రయించే వ్యాపారం చేస్తున్నారని తెలుసుకుంది. వారి కుటుంబ నేపథ్యం తెలిశాక కాస్తా దూరంగా ఉంటూ వచ్చింది. దాంతో ఆ భార్యాభర్తలు ఇద్దరూ కూడా మీనాక్షిపై కక్షగట్టారు.
అలా వారిని దూరం పెడుతూ వస్తున్న మీనాక్షి మీద పగ పెంచుకున్నారు. 2016లో ఓ కొత్త నెంబర్ నుంచి ఫోన్ చేసి రప్పించారు. విషయం తెలియని మీనాక్షి వారు చెప్పిన అడ్రస్కు చేరుకుంది. అప్పుడు కూడా పెళ్లి చేసుకోవాలంటూ వత్తిడి తెచ్చారు. అయినా కూడా మీనాక్షి నో చెప్పడంతో ఇష్టమొచ్చినట్లు కొట్టారు. అంతటితో ఆగకుండా ఆమె మొహంపై యాసిడ్తో దాడి చేశారు. అదలావుంటే ఈ కేసుపై విచారణ జరిపిన అడిషనల్ సెషన్స్ జడ్జి సతీందర్ కుమార్ గౌతం సంచలన తీర్పు చెప్పారు. నిందితులైన భార్యాభర్తలకు 11 సంవత్సరాల జైలుశిక్ష విధించారు. అలాగే బాధితురాలికి చెరో లక్ష రూపాయలు చెల్లించాలంటూ ఆదేశించారు.