ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం, కార్పొరేటర్ ర్యాలీపై యాసిడ్ దాడి, 25 మందికి గాయాలు!
బెంగళూరు: కర్ణాటకలోని తుమకూరు కార్పొరేషన్ ఎన్నికల్లో విజయం సాదించిన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి తన మద్దతుదారులతో ఊరేగింపుగా వెలుతున్న సమయంలో ర్యాలీ మీద యాసిడ్ దాడి జరిగింది. కెమికల్ దాడుల్లో 25 మందికిపైగా గాయాలు కావడంతో ఆసుపత్రికి తరలించారు.
తుమకూరు కార్పొరేషన్ వార్డు నెంబర్ 16లో కాంగ్రెస్ పార్టీ నుంచి ఇనాయతుల్లా ఖాన్ పోటీ చేశారు. సోమవారం జరిగిన కౌంటింగ్ లో కాంగ్రెస్ పార్టీ నాయకుడు ఇనాయతుల్లా ఖాన్ విజయం సాధించారు. కౌంటింగ్ కేంద్రం నుంచి కార్పోరేటర్ గా విజయం సాధించిన ఇనాయతుల్లా ఖాన్ ఆయన మద్దతుదారులతో ఊరేగింపుగా బయలుదేరారు.
తుమకూరులోని బార్ లైన్ రోడ్డులో ఊరేగింపు వెలుతున్న సమయంలో గుర్తు తెలియని వ్యక్తులు యాసిడ్ దాడులకు పాల్పడ్డారు. ఈ దాడిలో 25 మందికి పైగా గాయపడ్డారు. ఊరేగింపులో ఉన్న కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, కార్పొరేటర్ ఇనాయతుల్లా ఖాన్ అనుచరులు ఆందోళనతో పరుగు తీశారు.
గాయాలైన వారిని సమీపంలోని ప్రైవేటు ఆసుపత్రికి, తుమకూరు జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స చేయిస్తున్నారు. ఎన్నికల్లో తాను విజయం సాదించడంతో జీర్ణించుకోలేని ప్రత్యర్థులు యాసిడ్, కెమికల్ దాడులకు పాల్పడ్డారని కార్పొరేటర్ ఇనాయతుల్లా ఖాన్ ఆరోపించారు.
యాసిడ్ దాడులకు పాల్పడిన వారిని వెంటనే అరెస్టు చెయ్యాలని కార్పొరేటర్ ఇనాయతుల్లా ఖాన్, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు డిమాండ్ చేశారు. బైక్ లో వచ్చిన వ్యక్తులు యాసిడ్ దాడి చేశారని ప్రత్యక్షసాక్షులు, బాధితులు అంటున్నారు. కేసు నమోదు చేసిన పోలీసులు బార్ లైన్ రోడ్డులో ప్రైవేటు వ్యక్తులు ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలలోని క్లిప్పింగ్స్ పరిశీలిస్తున్నారు.