చేతివాటం: ఎయిరిండియాలో ఇంటి దొంగలు... విమానంలో ఏమి దోచుకున్నారంటే..?
న్యూఢిల్లీ: ఇంటిదొంగను ఈశ్వరుడైనా పట్టుకోలేడు అని అంటారు. ఇలాంటి పరిస్థితే ఎయిరిండియా సంస్థలో జరిగింది. కానీ ఇక్కడ దొంగలను మాత్రం పట్టుకున్నారు. అసలే ఎయిరిండియా సంస్థ కష్టాల్లో ఉంది. ఆ సమయంలో సిబ్బందే దొంగలుగా మారితే ఇంకెన్ని కష్టాలొస్తాయి..? అసలు ఏంజరిగిందో ఈ స్టోరీ చదివితే తెలుస్తుంది.
భారత ప్రభుత్వ రంగ విమానాయాన సంస్థ ఎయిరిండియాలో దొంగలు పడ్డారు. దొంగలు అంటే బయట నుంచి వచ్చిన దొంగలు కాదు... ఆ సంస్థలో పనిచేసే సిబ్బందే దొంగతనానికి పాల్పడింది. ఇంతకీ వారు ఏమి దొంగతనం చేశారనేగా మీ డౌటు.. అక్కడికే వస్తున్నాం. దూర ప్రాంతాలకు వెళ్లే ఎయిర్ ఇండియా విమానంలో ప్రయాణికుల కోసం ఉంచే ఆహారపదార్థాలపై సిబ్బంది చేతివాటం ప్రదర్శిస్తున్నట్లు ఎయిరిండియా యాజమాన్యం గుర్తించింది.
ఎయిరిండియా సిబ్బంది అంటే గ్రౌండ్ స్టాఫ్, ఆఫీసర్లు అప్పుడే వచ్చిన ఎయిరిండియా విమానం నుంచి రేషన్ సరుకులు తీసుకుంటున్నారన్న సమాచారంతో ఆగష్టు 2017లో ఎయిరిండియా ఛైర్మెన్ మరియు మేనేజింగ్ డైరెక్టర్ అశ్వని లోహానియా అంతర్గత విచారణకు ఆదేశించారు. అంతేకాదు ఒకవేళ నిజంగానే ఇలాంటి పనులకు పాల్పడిన అధికారులను సస్పెండ్ చేయాల్సిందిగా కోరారు. ఇక లోహానియా ఆదేశాలు ఇవ్వడంతో క్యాటరింగ్ డిపార్ట్మెంట్లో ఉన్న ఇద్దరు అధికారులపై చర్యలు తీసుకుంది. వీరితో పాటు క్యాబిన్ సిబ్బంది పై కూడా చర్యలు తీసుకుంది. వీరు విమానంలోని ప్రయాణికుల కోసం వినియోగించిన తర్వాత మిగిలిపోయే రేషన్ మొత్తాన్ని ఎవరికీ తెలియకుండా సర్దేసినట్లు తేలడంతో వారిపై చర్యలు తీసుకున్నారు.
సస్పెండ్కు గురైన వారిలో క్యాటరింగ్ శాఖకు చెందిన అసిస్టెంట్ మేనేజర్, సీనియర్ అసిస్టెంట్లు ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. వీరిని 63 రోజుల పాటు సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకటించారు. అంతేకాదు గతేడాది మార్చిలో న్యూఢిల్లీ నుంచి సిడ్నీకి వెళుతున్న విమానంలో క్యాబిన్ సిబ్బంది ఇద్దరిపై కూడా నిఘా పెట్టి వారిని హెచ్చరించడం జరిగిందని అధికారులు తెలిపారు. ఆ తర్వాత వారిని దేశీయ విమానాల్లో సిబ్బందిగా వేయడం జరిగిందన్నారు.