అయ్యప్ప స్వామి ఆలయంలోకి ప్రవేశించేందుకు ప్రయత్నించిన రెహానా ఫాతిమా బదిలీ
శబరిమలై అయ్యప్ప స్వామి ఆలయంలోకి మహిళలకు ప్రవేశం కల్పిస్తూ సుప్రీంకోర్టు ఇచ్చిన కీలక తీర్పు నేపథ్యంలో ఆలయంలోకి ప్రవేశించేందుకు ప్రయత్నించిన సామాజిక కార్యకర్త రెహానా ఫాతిమాను బీఎస్ఎన్ఎల్ సంస్థ బదిలీ చేసింది. బీఎస్ఎన్ఎల్లో పనిచేస్తున్న ఫాతిమాను ప్రస్తుతం పనిచేస్తున్న కొచ్చి నుంచి పలరివట్టం టెలిఫోన్ ఎక్స్ఛేంజ్కు బదిలీ చేసింది. అక్కడ ప్రజలతో సంబంధం ఉండదు కాబట్టే అక్కడికి బదిలీ చేసినట్లు అధికారులు తెలిపారు.
కస్టమర్ రిలేషన్షిప్ శాఖ నుంచి బదిలీ
కొచ్చిలోని బోట్ జెట్టి బీఎస్ఎన్ఎల్ బ్రాంచిలో రెహానా ఫాతిమా కస్టమర్ రిలేషన్ డిపార్ట్మెంట్లో టెలికాం టెక్నీషియన్గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. అక్కడికి చాలామంది అయ్యప్ప భక్తులు వచ్చి ఫాతిమాను తొలగించాల్సిందిగా పెద్ద ఎత్తున నిరసనలు చేస్తుండటంతోనే ఆమెను ప్రజలతో సంబంధం లేని పలరివట్టం బ్రాంచ్కు బదిలీ చేసినట్లు బీఎస్ఎన్ఎల్ సంస్థ వెల్లడించింది. బదిలీ ఈ కారణం చేతనే చేసినట్లు చెప్పిన బీఎస్ఎన్ఎల్... ఆమె విధులు సక్రమంగానే నిర్వహిస్తున్నట్లు క్లారిటీ ఇచ్చింది.
పలరివట్టం బీఎస్ఎన్ఎల్ కార్యాలయం వద్ద భక్తుల ఆందోళన
ఇక రెహానా ఫాతిమా పలరివట్టం బీఎస్ఎన్ఎల్ ఎక్స్ఛేంజ్కు బదిలీ అయ్యిందన్న విషయం తెలుసుకున్న శబరిమల కర్మ సమితి, పలరివట్టం వైపు వెళ్లి నిరసన తెలిపారు. వెంటనే ఆమెను అక్కడి నుంచి పంపించేయాలని వారు డిమాండ్ చేశారు. ఇదిలా ఉంటే అయ్యప్ప ఆలయంలోకి ప్రవేశించే ప్రయత్నం చేసి కొన్ని లక్షల మంది హిందువుల సెంటిమెంటును దెబ్బతీసిందని ఆరోపిస్తూ రెహనా ఫాతిమాను ముస్లిం సామాజిక వర్గం నుంచి బహిష్కరిస్తూ ఫత్వా జారీ చేశాయి పలు ముస్లిం సంఘాలు. అంతేకాదు ఫాతిమా అయ్యప్ప ఆలయానికి వెళ్లారన్న వార్త తెలుసుకున్న కొందరు గుర్తు తెలియని వ్యక్తులు ఆమె ఇంటిపై దాడి చేసి ధ్వంసం చేశారు.
నాడు టాప్లెస్గా ఉండి కర్భూజతో నిరసనలు
ఫాతిమా ఒక మోడల్, మరియు సామాజిక కార్యకర్త. 2014లో కేరళను ఊపేసిన కిస్ ఆఫ్ లవ్ ఉద్యమంలో మోరల్ పోలీసింగ్ను తప్పుబడుతూ ఉద్యమానికి మద్దతు ఇచ్చారు. ఆమె మరో మహిళా జర్నలిస్టుతో కలిసి శబరిమలైలోని అయ్యప్ప ఆలయంలోకి ప్రవేశించేందుకు ప్రయత్నించింది. కొండపైకి చేరుకున్న ఆమెకు పెద్ద ఎత్తున నిరసనలు వ్యక్తం అవడంతో ఆలయంలోకి ప్రవేశించకుండానే వెను దిరిగారు. ఇద్దరు పిల్లలకు తల్లి అయిన ఫాతిమా.... కోజికోడ్కు చెందిన ప్రొఫెసర్ మహిళల వక్షోజాలను కర్భూజాతో పోల్చడాన్ని తప్పుబడుతూ అవే కర్బూజాలతో టాప్లెస్గా దర్శనమిచ్చి నిరసన తెలిపారు.