శబరిమలకు తృప్తి దేశాయ్.. మరో మహిళా సామాజిక కార్యకర్తపై కారంపొడితో దాడి
కేరళ: శబరిమలలో మహిళల ప్రవేశంపై విస్తృతస్థాయి ధర్మాసనంకు బదిలీ చేస్తూ సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిన సంగతి తెలిసిందే. అయితే 2018లో శబరిమల ఆలయంలోకి మహిళలు ప్రవేశించొచ్చు అన్న తీర్పును మాత్రం న్యాయస్థానం కొట్టివేయలేదు లేదా స్టే ఇవ్వని నేపథ్యంలో ఆ తీర్పు ఇంకా కొనసోగుతోంది. ఈ క్రమంలోనే మహిళా సామాజిక కార్యకర్త తృప్తి దేశాయ్ అయ్యప్ప స్వామి దర్శనం కోసం శబరిమలైకు చేరుకుంది. నవంబర్ 26వ తేదీన రాజ్యాంగ దినోత్సవం పాటిస్తున్న నేపథ్యంలోనే ఈ తేదీని ఎంచుకున్నట్లు తృప్తి దేశాయ్ తెలిపారు.
2018 తీర్పును అనుసరించే శబరిమల దర్శనంకు వచ్చాను
సుప్రీంకోర్టు 2018లో ఇచ్చిన తీర్పును అనుసరిస్తూ తాను శబరిమల అయ్యప్ప స్వామి దర్శనంకు వచ్చినట్లు తృప్తి దేశాయ్ చెప్పారు. నాడు మహిళలకు శబరిమల ఆలయంలోకి ప్రవేశం ఉందని చెబుతూ సర్వోన్నత న్యాయస్థానం ఇచ్చిన తీర్పును ఆమె గుర్తుచేశారు. తాజాగా రివ్యూ పిటిషన్ పై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పులో గత తీర్పుపై స్టే కానీ కొట్టివేయడం కానీ చేయలేదని తృప్తి దేశాయ్ పునరుద్ఘాటించారు. అయ్యప్ప స్వామ దర్శనం చేసుకున్నాకే కేరళను వీడి వెళతానని బలంగా చెప్పారు తృప్తి దేశాయ్.
బిందు అమ్మినిపై కారంపొడితో దాడి
ఇదిలా ఉంటే బిందు అమ్మిని అనే మరో మహిళ కూడా అయ్యప్ప స్వామిని దర్శించుకునేందుకు శబరిమలకు చేరుకుంది. గతేడాది కూడా ఆమె తృప్తి దేశాయ్తో కలిసి ఆలయం సందర్శనకు వచ్చింది. అయితే ఈసారి తాను శబరిమల అయ్యప్ప స్వామిని దర్శించుకోవాలని భావించిన క్రమంలో ఎవరో తన ముఖంపై కారంపొడి, పెప్పర్లు చల్లారని పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ ఘటన ఎర్నాకులం సిటీ పోలీస్ కమిషనర్ కార్యాలయం బయట జరిగిందని చెప్పారు.
భద్రత కట్టుదిట్టం చేసిన పోలీసులు
గతేడాది అయ్యప్ప ఆలయంలోకి అన్ని వయసు మహిళలు ప్రవేశించొచ్చు అని సుప్రీంకోర్టు తీర్పు చెప్పిన నేపథ్యంలో మహిళా కార్యకర్త తృప్తి దేశాయ్ ఆలయంలోకి ప్రవేశించేందుకు చేసిన ప్రయత్నం విఫలమైంది. అయితే ఈ సారి మాత్రం కచ్చితంగా స్వామివారిని దర్శించుకునే వెళతానని పట్టుబట్టడంతో అక్కడ ఎలాంటి ఉద్రిక్తత పరిస్థితులు జరగకుండా పోలీసులు భద్రతను కట్టుదిట్టం చేశారు.