శని సింగణాపూర్లో ఉద్రిక్తత: స్త్రీలను లాగిపడేశారు
ముంబై: భూమాతా బ్రిగేడ్ కార్యకర్తల రాకతో శని సింగణాపూర్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. దేవాలయంలో ప్రవేశానికి పురుషులతో పాటు మహిళలతో ఆలయ ప్రవేశాల్లో సమాన హక్కు ఉంటుందని, వారిని ఎవ్వరూ అడ్డుకోకూడదని బాంబే హైకోర్టు తీర్పు ఇచ్చిన సంగతి తెలిసిందే.
ఈ నేపథ్యంలో మహారాష్ట్రలో శని శింగణాపూర్ శని దేవాలయంలోకి ప్రవేశించేందుకు తృప్తి దేశాయ్ నేతృత్వంలో మహిళలు భారీ ర్యాలీగా అక్కడికి చేరుకున్నారు. ఆలయంలోకి ప్రవేశించేందుకు యత్నించిన మహిళలను పోలీసులు, దేవాలయ ట్రస్ట్ బోర్డు సభ్యులు, స్థానికులు అడ్డుకున్నారు.
దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఓ మాజీ ఎమ్మెల్యే కూడా మహిళలకు మద్దతుగా నిలిచారు. మహిళలను అడ్డుకుంటున్న వారిలో స్థానిక ఎన్సీపీ నేతలు కూడా ఉన్నారు. ఆలయంలోకి మహిళలను అనుమతించడంపై ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశాలు జారీచేసిన పోలీసులు అడ్డుకోవడంపై మహిళలు మండిపడ్డారు.
ఆలయంలోకి వెళ్లేంతవరకు ఇక్కడినుంచి కదిలేది లేదని అన్నారు. ఆలయంలోకి అనుమతించకపోవడంపై తృప్తి దేశాయ్ మాట్లాడుతూ హైకోర్టు అనుమతి ఇచ్చినా తమను లోనికి ప్రవేశించకుండా అడ్డుకోవటం దారుణమన్నారు. తాము వెనకడుగు వేసేది లేదని అన్నారు.
కాగా తృప్తి దేశాయ్కి వ్యతిరేకంగా స్థానికులు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ప్రభుత్వం అనుమతి ఇచ్చినా... తాము మహిళలను ఆలయంలోకి అనుమతి ఇచ్చేది లేదని స్పష్టం చేశారు. దీంతో కోర్టు మమ్మల్ని ఆలయంలోకి అనుమతించాలని ఆదేశాలు జారీచేసినా పోలీసులు పాటించడంలేదని భూమాత బ్రిగేడ్ ప్రతినిధులు ఆరోపిస్తున్నారు.
అంతక ముందు మహారాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు ఇచ్చిన ఆదేశాల్లో మహిళల హక్కులను కాపాడాలని పేర్కొంది. దేవాలయంలోకి మహిళల ప్రవేశంపై తమకు ఎటువంటి అభ్యంతరాలు లేవని మహా ప్రభుత్వం స్పష్టం చేసింది. దీంతో శనివారం భూమాతా బ్రిగేడ్ కార్యకర్తలు ర్యాలీగా వచ్చిన మహిళలను అడ్డుకున్నారు.
దేవాలయ ట్రస్ట్ బోర్డు హైకోర్టు ఆదేశాలను అమలు చేస్తుందా? లేదా? అన్నది ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది. ఈ నేపథ్యంలో హైకోర్టు ఆదేశాల కాపీ తమకు అందలేదని దేవాలయ ట్రస్ట్ బోర్డు చెబుతోంది. హైకోర్టు తీర్పు లింగ వివక్షకు వ్యతిరేకంగా సాధించిన విజయమని భూమాత బ్రిగేడ్ నేత తృప్తి దేశాయ్ పేర్కొన్నారు.
#WATCH Stand off between Bhumata brigade and the locals at #ShaniShinganapur temple complexhttps://t.co/WJNkQw2uvF
— ANI (@ANI_news) April 2, 2016