చెప్పు దెబ్బలు తప్పవు: తప్తి దేశాయ్కి సేన వార్నింగ్
న్యూఢిల్లీ: మహిళా హక్కుల కార్యకర్త, భూమాత రణరాగిణి బ్రిగేడ్ సంస్థ అధ్యక్షురాలు తృప్తి దేశాయ్ని ఉద్దేశించి శివసేన ముస్లిం నాయకుడు ఒకరు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తృప్తి దేశాయ్ హజీ అలీ దర్గాలోకి అడుగు పెడితే చెప్పులతో కొడతారని హెచ్చరించారు శివసేన నేత హజీ అరాఫత్ షేక్.
ఈయన ఇటీవలే మహారాష్ట్ర నవ నిర్మాణ సేన నుంచి బయటకు వచ్చి శివసేనలో చేరారు. 'నా మతం తరఫున నేను గళమెత్తుతాను. మజార్ను తాకేందుకు ఆమెను అనుమతించను. ముస్లిం మహిళలు కూడా దీనిని వ్యతిరేకిస్తున్నారు' అని చెప్పారు.
ఇటీవల హజీ అలీ దర్గా ప్రాంగణంలోకి వెళ్లి ప్రార్ధనలు చేస్తానని తృప్తి ప్రకటించిన సంగతి తెలిసిందే. పలు ఆలయ ప్రాంగణాల్లోకి మహిళల ప్రవేశం ఎందుకు ఉండకూడదంటూ ప్రశ్నిస్తూ పోరాటాలు చేస్తున్నారు భూమాత బ్రిగేడ్ అధ్యక్షురాలు తృప్తి దేశాయ్.
ఈమె పోరాట ఫలితంగా త్రయంబకేశ్వర్, శని సింగణాపూర్, శబరిమలై ఆలయాల్లోకి మహిళల ప్రవేశాన్ని కొర్టులు కూడా సమర్ధించాయి. దీంతో కొంత మంది హిందూ మత పెద్దలు.. హిందూ ఆలయాల సంగతి సరే, ముస్లిం దర్గాల్లోకి కూడా మహిళలను రానివ్వరు కదా.. మరి కోర్టులు జోక్యం చేసుకోగలవా? అని ప్రశ్నించారు.
ఇది ఇలా ఉండగా, హిందూ దేవాలయాల్లో మహిళల ప్రవేశం కోసం పోరాడుతున్న తృప్తి దేశాయ్ ఇటీవల హజీ ఆలి దర్గాలోకి కూడా ప్రవేశిస్తామని ప్రకటించింది. స్త్రీలకు ప్రవేశం లేని ఈ దర్గాలో మహిళలతో కలిసి ప్రార్థనలు నిర్వహిస్తామని ఆమె తెలిపింది.
ఆమె వ్యాఖ్యలను తీవ్రంగా తప్పుబట్టిన షేక్.. దర్గాలోకి ప్రవేశించాలన్న తృప్తి ప్రయత్నం వెనుక కుట్ర దాగి ఉందని, ముంబైలో నెలకొన్న శాంతియుత వాతావరణాన్ని దెబ్బతీసేందుకే ఈ కుట్ర జరుగుతున్నదని ఆరోపించారు.
కాగా, మతం ఏదైనా.. మహిళల సమానత్వపు హక్కు కోసం తాను పోరాటం చేస్తూనే ఉంటానని తృప్తి దేశాయ్ ప్రకటించారు. ఏప్రిల్ 28న హజీ ఆలి దర్గాలోకి తాము ప్రవేశించి తీరుతామని, శివసేన బెదిరింపులకు తలొగ్గబోమని తృప్తి దేశాయ్ స్పష్టం చేస్తున్నారు. హజీ అరాఫత్ షేక్ హెచ్చరికతో తృప్తి ఎలా స్పందస్తారో చూడాల్సిందే. మరి ఆమెకు అక్కడ ఎలాంటి అనుభవం ఎదురుకానుందో వేచి చూడాలి.