బాలన్నా... ఒక్కసారి లేచి పాట పాడవా... బోరున విలపించిన అర్జున్.. ప్రముఖుల కంట తడి...
గాన గంధర్వుడు ఎస్పీ బాల సుబ్రహ్మణ్యం అంత్యక్రియల సందర్భంగా పలువురు సినీ ప్రముఖులు తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. ఎస్పీబీని కడసారి చూసేందుకు వచ్చిన నటుడు అర్జున్... ఆయన పార్థివదేహాన్ని చూసి బోరున విలపించారు. 'బాలన్నా... నా సినిమాలకు ఎన్నో దేశభక్తి గీతాలు అందించావు.. ఇప్పుడు నాకోసం ఒక్కసారి లేచి పాట పాడవా..' అంటూ కన్నీళ్లు పెట్టుకున్నారు. అత్యంత ఉద్విగ్న వాతావరణంలో జరిగిన బాలు అంత్యక్రియల్లో చెమ్మగిల్లని కళ్లు లేవు.
నా పేరు ముందు అవి వాడకండి - ఎస్పీ బాలు రాసిన లేఖ వైరల్- గాన చంద్రుడన్న సోనియా గాంధీ
భారతీరాజా కన్నీటిపర్యంతం...
ఎస్పీ బాల సుబ్రహ్మణ్యంకు అత్యంత సన్నిహితుడు,ప్రముఖ దర్శకుడు భారతీ రాజా కూడా తీవ్ర ఉద్వేగానికి లోనయ్యారు. తన చిరకాల మిత్రుడు ఇక లేడన్న విషయాన్ని తట్టుకోలేక కన్నీటిపర్యంతమయ్యారు. ఎస్పీబీకి భారతరత్న ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వానికి భారతీ రాజా విజ్ఞప్తి చేశారు. గాయకుడు మనో కూడా ఎస్పీబీ పార్థివ దేహానికి నివాళులర్పించే సమయంలో తీవ్ర భావోద్వేగానికి గురై కన్నీళ్లు పెట్టుకున్నారు.
కంటతడి పెట్టుకున్న దేవీశ్రీ...
క్లాస్ సాంగ్ అయినా,మాస్ సాంగ్ అయినా బాలు గొంతులో పడితే దానికి న్యాయం జరిగేదని సంగీత దర్శకుడు దేవిశ్రీప్రసాద్ అన్నారు. తాను మొదటిసారిగా మ్యూజిక్ చేసినప్పుడు పాట పాడాలని కోరితే తన కోరికను మన్నించారని చెప్పారు. ఆ మహా వ్యక్తి ఇక లేరంటే నమ్మలేకపోతున్నానని కంట తడి పెట్టుకున్నారు. నటి శ్రీరెడ్డి కూడా బాలు అంత్యక్రియల్లో పాల్గొన్నారు. ఆయన పార్థివ దేహానికి నివాళులు అర్పించారు. సాధారణంగా తాను ఇలాంటి కార్యక్రమాలకు హాజరుకానని... కానీ ఎస్పీబీ ఓ లెజెండ్ అని, ఆయనపై ఉన్న అభిమానం, గౌరవంతో ఇక్కడకు వచ్చానని చెప్పారు.
సూపర్ స్టార్ విజయ్ హాజరు....
ఎస్పీబీతో కలిసి చిత్తూరు జిల్లా నగరిలో 9వ తరగతి వరకు చదువుకున్న 50 మంది జెడ్పీ పాఠశాల పూర్వపు విద్యార్థులు కూడా ఆయన అంత్యక్రియల్లో పాల్గొన్నారు. ఆయన పార్థివ దేహానికి నివాళులు అర్పించి కన్నీళ్లు పెట్టుకున్నారు. తమిళ సూపర్ స్టార్ విజయ్ కూడా హఠాత్తుగా అంత్యక్రియలకు రావడం గమనార్హం. ఎస్పీబీ పార్థివ దేహానికి నివాళులు అర్పించిన విజయ్... ఎస్పీ చరణ్ను ఓదార్చారు. కాసేపటికి తిరిగి వెళ్లిపోయారు.
Recommended Video
పాటలతో ఊరేగింపు....
ఎస్పీబీ అంత్యక్రియల్లో ఆయన పాటలు మారుమోగాయి. ప్రముఖులు,అభిమానులు ఆయన పాటలు పాడుతూ ఊరేగింపులో పాల్గొన్నారు. ప్రముఖులు, అభిమానుల సందర్శనను 10.45 గంటలకు నిలిపి వేశారు. అనంతరం కేవలం అత్యంత సన్నిహితులు,కుటుంబ సభ్యులను మాత్రమే అనుమతించారు. ఆపై ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించారు. పోలీసులు మూడు రౌండ్లలో 72 తూటాలను గాల్లోకి పేల్చారు. వేద పండితులతో శాస్త్రోక్తంగా ఖననం పూర్తి చేశారు.