మీటూ: విచారణకు హాజరైన యాక్సన్ కింగ్ అర్జున్, హైకోర్టు అర్జీ, రూ. 5 కోట్లకు పరువు నష్టం!
బెంగళూరు: బహుబాష నటుడు, దర్శక నిర్మాత, యాక్షన్ కింగ్ అర్జున్ లైంగిక వేధింపుల కేసులో సోమవారం బెంగళూరు పోలీసుల ముందు విచారణకు హాజరై వివరణ ఇచ్చారు. విచారణ చేసిన కబ్బన్ పార్క్ పోలీసులు హీరో అర్జున్ ఇచ్చిన సమాచారం మేరకు ఎఫ్ఐఆర్ నమోదు చేసి విచారణ మొదలు పెట్టారు. నటి శృతి హరిహరన్ మీద కర్ణాటక హై కోర్టులో రూ. 5 కోట్లకు హీరో అర్జున్ పరువు నష్టం దావా వేశారు.
శృతి హరిహరన్
రెండు సంవత్సరాల క్రితం విస్మయ సినిమా షూటింగ్ సందర్బంగా హీరో అర్జున్ తనను లైంగికంగా చిత్రహింసలకు గురి చేశాడని, అప్పుడు భయంతో తాను నోరు విప్పలేదని, ఇప్పుడు ధైర్యంగా చెబుతున్నానని ఇటీవల నటి శృతి హరిహరన్ (మీ టూలో భాగంగా) ఆరోపణలు చేశారు.
చర్చలు విఫలం
నటి శృతి హరిహరన్ ఆరోపణలు వివాదానికి కారణం అయ్యింది. యాక్షన్ కింగ్ అర్జున్ మీద వచ్చిన ఆరోపణలపై కన్నడ చలన చిత్ర వాణిజ్య మండలి పూర్తి సమాచారం సేకరించింది. హీరో అర్జున్, నటి శృతి హరిహరన్ ల మధ్య రాజీ చెయ్యడానికి కన్నడ చలనచిత్ర వాణిజ్య మండలి ప్రయత్నించి చివరికి విఫలం అయ్యింది.
పోలీసు కేసు పెట్టిన నటి
కన్నడ చలన చిత్ర వాణిజ్య మండలి జరిపిన చర్చలు విఫలం కావడంతో నటి శృతి హరిహరన్ కబ్బన్ పార్క్ పోలీస్ స్టేషన్ లో హీరో అర్జున్ తనను లైంగిక వేధింపులకు గురి చేశాడని ఫిర్యాదు చేసింది. హీరో అర్జున్ తో పాటు ఐదు మంది మీద నటి శృతి హరిహరన్ పోలీసులకు ఫిర్యాదు చేసింది.
పోలీసుల విచారణ
సోమవారం హీరో అర్జున్ కబ్బన్ పార్క్ పోలీస్ స్టేషన్ అధికారుల ముందు విచారణకు హాజరై వివరణ ఇచ్చారు. హీరో అర్జున్ తో పాటు ఆయన బంధువులు, కన్నడ హీరోలు దృవ సర్జా, చిరంజీవి సర్జా, మాజీ ఎంపీ, బీజేపీ నాయకురాలు తేజస్వినీ విచారణాధికారి అన్నయ్య ముందు హాజరైనారు. తమ అభిమాన నటుడు పోలీసుల ముందు హాజరు అవుతున్నారని తెలుసుకున్న హీరో అర్జున్ అభిమానులు కబ్బన్ పార్క్ పోలీస్ స్టేషన్ ముందు గుమికూడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. హీరో అర్జున్ అభిమాలు ఆందోళన చెయ్యకుండా పోలీసులు పలు జాగ్రత్తలు తీసుకున్నారు.
హై కోర్టులో పరువు నష్టం దావా
లైంగిక వేధింపుల ఆరోపణలు చేసిన నటి శృతి హరిహరన్ మీద చర్యలు తీసుకోవడానికి హీరో అర్జున్ కర్ణాటక హైకోర్టును ఆశ్రయించారు. కర్ణాటక హైకోర్టులో నటి శృతి హరిహరన్ మీద రూ. 5 కోట్లకు హీరో అర్జున్ పరువు నష్టం దావా వేశారు. హీరో అర్జున్ సమర్పించిన పిటిషన్ నవంబర్ 9వ తేదీ హై కోర్టులో విచారణ జరగనుంది.