పౌరసత్వ చట్టం వల్ల ఉపయోగం ఉందా?: సుప్రీంలో కమల్ హాసన్ పిటీషన్..!
న్యూఢిల్లీ: భారతీయ జనతా పార్టీ అంటే ఒంటికాలి మీద లేచే బహుభాషా నటుడు కమల్ హాసన్.. దేశ అత్యున్నత న్యాయస్థానం తలుపు తట్టారు. దేశవ్యాప్తంగా అమలు చేయడానికి ఉద్దేశించిన పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా పిటీషన్ ను దాఖలు చేశారు. పౌరసత్వ సవరణ చట్టాన్ని వ్యతిరేకిస్తూ- దక్షిణాది రాష్ట్రాల నుంచి సుప్రీంకోర్టులో ఓ పిటీషన్ దాఖలు కావడం ఇదే తొలిసారి. కమల్ హాసన్ సారథ్యం వహిస్తోన్న మక్కళ్ నీథి మయ్యం (ఎంఎన్ఎం) తరఫున ప్రముఖ న్యాయవాది ఈ పిటీషన్ ను వేశారు.
పౌరసత్వ సవరణ బిల్లు, ఆరోగ్యంగా ఉంటే ఆపరేషన్ చేస్తారా, చంపేస్తారా ? హీరో కమల్ హాసన్ !
మతాల వారీగా ప్రజలను విభజించే ప్రయత్నం..
కేంద్రంలో అధికారంలో ఉన్న ఎన్డీఏ కూటమికి సారథ్యాన్ని వహిస్తోన్న బీజేపీ అమల్లోకి తీసుకొచ్చిన పౌరసత్వ సవరణ చట్టం వల్ల ఎలాంటి ప్రయోజనమూ ఉండబోదని ఈ పిటీషన్ లో పేర్కొన్నారు. భిన్నత్వంలో ఏకత్వం అనే భారత మూల సిద్ధాంతాలకు గొడ్డలిపెట్టుగా పరిణమించిందని, ఈ చట్టాన్ని వెనక్కి తీసుకునేలా కేంద్ర ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేయాలని విజ్ఞప్తి చేశారు. సమాజాన్ని విభజించడానికే ఈ చట్టాన్ని తీసుకొచ్చినట్లు తమ పార్టీ భావిస్తోందని కమల్ హాసన్ స్పష్టం చేశారు.
మతిలేని చర్యగా..
పౌరసత్వ సవరణ చట్టాన్ని మతిలేని చర్యగా ఆయన అభివర్ణించారు. దేశ ప్రజలందరూ ఈ చట్టాన్ని వ్యతిరేకిస్తున్నారని, ప్రశాంతంగా ఉండే ఈశాన్య రాష్ట్రాలు సైతం దీనిపై భగ్గుమంటున్నాయని చెప్పారు. భారత్ ను ముస్లిం రహిత దేశంగా మార్చడానికి కేంద్ర ప్రభుత్వం కుట్ర పన్నిందని, అది ఈ చట్టంతో బహిర్గతమైందని విమర్శించారు. పాకిస్తాన్, బంగ్లాదేశ్, ఆప్ఘనిస్తాన్ ల నుంచి శరణార్థులుగా భారత్ కు వచ్చిన హిందువులకు మాత్రమే భారత పౌరసత్వాన్ని కల్పించాల్సిన అవసరం ఏముందని ప్రశ్నించారు.
శ్రీలంక తమిళుల పరిస్థితేంటీ?
శరణార్థులు ఎవరైనా శరణార్థులేనని చెప్పారు. ఈ జాబితాలో శ్రీలంకను చేర్చకపోవడం పట్ల కమల్ హాసన్ ఆశ్చర్యాన్ని వ్యక్తం చేశారు. లక్షమందికి పైగా శ్రీలంకకు చెందిన తమిళులు మనదేశ భూభాగంపై నివసిస్తున్నారని, వారికి ఎలాంటి ఆదరణ లభించట్లేదని అన్నారు. లక్షమందికి పైగా శ్రీలంక నుంచి శరణార్థులుగా భారత్ కు వచ్చిన తమిళులకు ఎలాంటి న్యాయం చేస్తారని కమల్ హాసన్ నిలదీశారు. పౌరసత్వ సవరణ చట్టంలో శ్రీలంక పేరును ఎందుకు చేర్చలేదని నిలదీశారు.