అన్నాడీఎంకే విలీనంపై కమల్, 'చరిత్రలో విడిపోయిన ఏ పార్టీ కలవలేదు'
అన్నాడీఎంకే వర్గాలు విలీనం కావడంపై ప్రముఖ నటుడు కమల్ హాసన్ స్పందించారు. ఆయన సోషల్ మీడియా వేదికగా పన్నీరు సెల్వం, పళనిస్వామి వర్గాల విలీనంపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
చెన్నై: అన్నాడీఎంకే వర్గాలు విలీనం కావడంపై ప్రముఖ నటుడు కమల్ హాసన్ స్పందించారు. ఆయన సోషల్ మీడియా వేదికగా పన్నీరు సెల్వం, పళనిస్వామి వర్గాల విలీనంపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
చదవండి: ఎట్టకేలకు విలీనం: పన్నీరు డిమాండ్లకు పళని ఓకే, శశికళకు షాక్
టోపీలు పెడుతున్నారు
పార్టీలు విడిపోవడం, మళ్లీ కలవడం వంటి చర్యలతో తమిళ ప్రజలను ప్రభుత్వం వెర్రివాళ్లను చేస్తోందని కమల్ హాసన్ కామెంట్ చేశారు. తమిళుల తల మీద గాంధీ టోపీ, కాషాయం టోపీ, కాశ్మీర్ టోపీలతో పాటు ఇప్పుడు జోకర్ టోపీ కూడా పెట్టారని ఆయన తమిళంలో ట్వీట్ చేశారు.
కమల్ హాసన్పై ప్రభుత్వం అసహనం!
సోషల్ మీడియా ద్వారా తమిళ రాజకీయాలపై ప్రభావం చూపించడానికి ప్రభుత్వ పని తీరుపై స్పందించాల్సిందిగా తన అభిమానులను కమల్ ఉసిగొల్పడంపై తమిళ ప్రభుత్వం ఒకింత అసహనంగా ఉన్నట్లుగా తెలుస్తోంది.
కొలిక్కి వచ్చిన విలీనం
కాగా, తమిళనాట అధికార పార్టీ అన్నాడీఎంకే వర్గాలు విలీనమైన విషయం తెలిసిందే. జయలలిత మృతి తర్వాత చీలిన పన్నీర్ సెల్వం, పళనిస్వామి వర్గాలు ఏకమయ్యాయి. గత కొన్ని రోజులుగా నడస్తున్న అన్నాడీఎంకే వర్గాల విలీన వ్యవహారం ఎట్టకేలకు కొలిక్కి వచ్చింది. ఈ మేరకు పార్టీ ప్రధాన కార్యాలయంలో జరిగిన భేటీ అనంతరం రెండు వర్గాలు విలీనం అవుతున్నట్లు పన్నీర్ సెల్వం ప్రకటించారు.
నాపై భారం తొలగిపోయింది: పన్నీరుసెల్వం
పార్టీ ఐక్యమత్యం కోసం శాయశక్తులా పని చేస్తానని పన్నీరుసెల్వం అన్నారు. ఈ రోజుతో తనపై ఉన్న భారం తొలగిపోయిందన్నారు. విలీనానికి సంతోషంగా అంగీకరించానన్నారు. జయ ఇచ్చిన హామీలను పూర్తిగా అమలు చేస్తామన్నారు.
తమిళనాట చరిత్రలో విడిపోయిన ఏ పార్టీ కలవలేదు, కానీ
తమిళనాడు చరిత్రలో విడిపోయిన పార్టీలు ఏవీ తిరిగి కలవలేదని సీఎం పళనిస్వామి అన్నారు. అలా కలిసిన పార్టీ అన్నాడీఎంకే మాత్రమేనన్నారు. పార్టీని ఇకపై మార్గదర్శక కమిటీ నిర్వహిస్తుందని స్పష్టం చేశారు. మార్గదర్శక కమిటీకి పన్నీర్ సెల్వం కన్వీనర్గా వ్యవహరిస్తారన్నారు. రెండాకుల గుర్తును తిరిగి పొందేందుకే తొలి ప్రాధాన్యం ఇవ్వనున్నట్టు చెప్పారు.
కేబినెట్లోకి పన్నీరువర్గం
పన్నీర్ వర్గం పళని మంత్రివర్గంలోకి చేరనుంది. పన్నీర్ సెల్వం వర్గానికి చెందిన ఇద్దరు ఎమ్మెల్యేలు సైతం మంత్రివర్గంలో చోటు దక్కించుకోనున్నారు. ఈ మేరకు డిప్యూటీ సీఎం పదవిలో అన్నాడీఎంకే పార్టీ మార్గదర్శక కమిటీకి కన్వీనర్గా పన్నీర్ సెల్వం, సహ కన్వీనర్గా పళనిస్వామి వ్యవహరించనున్నారు.