అమ్మ సమాధి వద్ద నవ్వుతూ సెల్ఫీ దిగిన ఎమ్మెల్యే..
అమ్మ అంత్యక్రియల సందర్బంలో తిరువాడానై ఎమ్మెల్యే కరుణాస్ వ్యవహరించిన తీరు ప్రస్తుతం వివాదస్పదంగా మారింది.
చెన్నై: తమ ఆరాధ్య నేతకు నివాళులు అర్పించేందుకు మెరీనా బీచ్ లోని అమ్మ సమాధి వద్దకు తమిళ జనం పోటెత్తుతూనే ఉన్నారు. పలువురు ప్రముఖులు, సామాన్యుల తాకిడితో అమ్మ సమాధి వద్ద జనం రద్దీ ఎక్కువగానే ఉంది.
కాగా, అమ్మ అంత్యక్రియల సందర్బంలో తిరువాడానై ఎమ్మెల్యే కరుణాస్ వ్యవహరించిన తీరు ప్రస్తుతం వివాదస్పదంగా మారింది. ఆ సందర్బంగా ఓ ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. ఎమ్మెల్యే కరుణాస్ నటుడు కూడా కావడంతో.. అమ్మ సమాధి వద్దకు వచ్చిన ఆయన అభిమాని ఒకరు తనతో సెల్ఫీ దిగేందుకు ప్రయత్నించాడు.
ఎమ్మెల్యే కరుణాస్ సున్నితంగా తిరస్కరించినా.. అతడు పదే పదే బ్రతిమాలడటంతో ఇక కాదనలేక సెల్ఫీ దిగాడు. ఆ తర్వాత దాన్ని సదరు అభిమాని సోషల్ మీడియాలో పోస్టు చేయడంతో కరుణాస్ పై పలువురు నెటిజెన్స్ విమర్శలు గుప్పించడం మొదలుపెట్టారు.
అమ్మ సమాధి వద్ద నవ్వుతూ సెల్ఫీలకు పోజులు ఇవ్వడమేంటని ప్రశ్నిస్తున్నారు. అయితే విమర్శల పట్ల స్పందించిన కరుణాస్.. ఇందులో అభిమాని అత్యుత్సాహం తప్ప తన తప్పిదమేమి లేదని తెలిపారు.
వాస్తవానికి . రాజాజీ హాల్ వద్ద, ఎంజీఆర్ స్మారక మందిరం వద్ద కూడా తనతో సెల్ఫీ దిగేందుకు పలువురు యత్నించారని... అయితే, వారందరినీ తాను తిట్టి పంపించానని పేర్కొన్నారు. ఇక అమ్మ సమాధి వద్దకు వచ్చిన సమయంలో.. 'గ్రామం నుంచి వచ్చానని మీతో ఓ సెల్ఫీ దిగాలని' ఆ యువకుడు బతిమాలడటంతోనే.. ఇష్టం లేకపోయినా ఒప్పుకోవాల్సి వచ్చిందని తెలిపారు.
ఇలాంటి పరిస్థితుల్లో ఎలా నడుచుకోవాలో తనకు తెలుసునని, అయితే ప్రజలు అలా నడుచుకోవడం లేదని చెప్పారు. అమ్మపై తనకు ఎంత విశ్వాసం ఉందో ఆమెకు కూడా తెలుసని చెప్పిన కరుణాస్.. అమ్మ సమాధి వద్ద నుంచి పిడికెడు మట్టిని తెచ్చుకుని తన ఇంట్లో భద్రపరుచుకున్నానని చెప్పడం గమనార్హం.