ఏ పార్టీలో చేరడం లేదు: బీజేపీపై ఖుష్బూ, కాంగ్రెస్ వైపు
చెన్నై: తాను భారతీయ జనతా పార్టీలో చేరేది లేదని ప్రముఖ సినీ నటి, రాజకీయ నాయకురాలు ఖుష్బూ స్పష్టం చేశారు. ఇటీవల ఆమె ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రారంభించిన స్వచ్ఛ భారత్ కార్యక్రమం పైన స్పందించారు. అందరు దానికి మద్దతు పలకాలన్నారు. ఈ నేపథ్యంలో ఆమె బీజేపీలో చేరుతారా అనే ప్రశ్న పలువురిని తొలచింది.
దీని పైన ఆమె తన మైక్రోబ్లాగింగ్ సైట్లో స్పందించారు. తాను ప్రస్తుతానికి ఏ రాజకీయ పార్టీలో చేరడం లేదని ఆమె పేర్కొన్నారు. తాను ఓ పార్టీలో చేరుతున్నట్లు ప్రచారం సాగుతోందని, అవి వాస్తవ విరుద్ధమైనవని ఆమె చెప్పారు.
కాగా, కొద్ది రోజుల క్రితం మోడీ ఇచ్చిన 'స్వచ్చ భారత్' పిలుపుకు ప్రముఖ తమిళనాడు రాజకీయ నాయకురాలు, నటి ఖుష్బూ మద్దతు పలికారు. స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో అందరు పాల్గొనాలని నరేంద్ర మోడీ అందరిని కోరారు. దీనికి సినిమా ప్రముఖులు, పారిశ్రామికవేత్తలు, క్రీడాకారులు మద్దతు పలుకుతున్నారు.
ఖుష్బూ కూడా మద్దతు పలికారు. మోడీ ఇప్పుడో మంచి దారి చూపించారని, ఆయన వెంట మనం ఎందుకు నడవకూడదన్నారు. భారత దేశానికి సేవ చేసేందుకు మనకు ఇదో చిన్న అవకాశమని ఆమె అభిప్రాయపడ్డారు. పరిశుభ్రత, పారిశుద్ధ్యం, క్లీన్లీనెస్ ఇవి చాలా అవసరమన్నారు.
తన సినీ గ్లామర్, వాక్చాతుర్యంతో అభిమానులను ఆకర్షించగల నటి ఖుష్బూ తమిళ రాజకీయాల్లో తనదైన పాత్ర పోషిస్తున్నారు. డీఎంకేలో చేరిన ఆమె త్వరలోనే కీలక నేత స్థాయికి ఎదిగారు. అనంతరం ఆమె ఆ పార్టీ నుంచి బయటకు కూడా వచ్చారు. ఈ క్రమంలో ఆమె బీజేపీలో చేరుతుందన్న వార్తలు ఊపందుకున్నాయి. అయితే ఈ ప్రచారాన్ని ఆమె కొట్టిపారేశారు.
కాంగ్రెస్లో చేరుతారా?
ఖుష్బూ కాంగ్రెస్ పార్టీలో చేరవచ్చుననే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. సాయంత్రం ఆమె దీని పైన ప్రకటన చేయనున్నారని సమాచారం. ఖుష్బూ కాసేపట్లో సోనియా, రాహుల్ గాంధీని కలవనున్నారు. ఆమె పార్టీలో చేరే అంశాన్ని కాంగ్రెస్ వర్గాలు ధృవీకరించాయి.