నటి మీనా ఇంటి విషాదం: ఆమె భర్త కన్నుమూత
నటి మీనా ఇంట తీవ్ర విషాదం నెలకొంది. ఆమె భర్త విద్యాసాగర్ మంగళవారం రాత్రి చనిపోయాడు. పోస్ట్ కోవిడ్ సమస్యలతో చనిపోయాడు. విద్యాసాగర్ చెన్నైలోని ఎంజీఎం ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశాడు. ఈ ఏడాది జనవరిలో మీనా కుటుంబం కరోనా బారిన పడింది. మెల్లగా కోలుకున్న ఆమె భర్త విద్యాసాగర్, అప్పటి నుండి మధ్యలో కొంత అస్వస్థతకు గురవుతున్నారని తెలిసింది. కాసేపటి క్రితం చెన్నై ఎంజీఎం హాస్పిటల్ లో మరణించారు. కొన్నేళ్ల నుండి విద్యాసాగర్ ఊపిరితిత్తులకు సంబందించిన వ్యాధితో బాధపడుతున్నారు, ఆయనకి ఇటీవల ఊపిరి తీసుకోవడం కూడా ఒకింత కష్టం అవడంతో వెంటనే ఆయనను సమీప ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. మీనా భర్త హఠాన్మరణం విషయం తెలిసిన పలువురు చిత్ర రంగ ప్రముఖులు ఆత్మకు శాంతి చేకూరాలని నివాళులు అర్పిస్తున్నారు.
తెలుగు సినీ పరిశ్రమలో బాలనటిగా పలు సినిమాల్లో నటించిన అనంతరం నవయుగం సినిమా ద్వారా మీనా హీరోయిన్ గా పరిచయం అయ్యారు. తర్వాత సీతారామయ్యగారి మనవరాలు, ఇంద్రభవనం, జగన్నాటకం, చంటి ఇలా వరుసగా అనేక సక్సెస్ఫుల్ సినిమాలు చేశారు. అప్పటి స్టార్ హీరోలు చిరంజీవి, బాలయ్య, నాగార్జున, వెంకటేష్ సహా అందరితో నటించారు. అటు తమిళ్, మలయాళం లో కూడా పలు సక్సెసఫుల్ సినిమాల్లో నటించారు. 2009లో విద్యాసాగర్ ని వివాహం చేసుకున్నారు. ఇక వారి కూతురు నైనిక ఇటీవల విజయ్ హీరోగా రూపొందిన తేరి మూవీలో నటించింది.