ఎయిర్ పోర్టులో ప్రకాష్ రాజ్ కు బెదిరింపులు, డ్రైవర్ కు వార్నింగ్, పబ్ కేసు, కౌంటర్!
బెంగళూరు: ఎయిర్ పోర్టు దగ్గర తనను గుర్తు తెలియని వ్యక్తులు బెదిరించడానికి ప్రయత్నించారని, తన కారు డ్రైవర్ కు వార్నింగ్ ఇచ్చారని బహుబాష నటుడు ప్రకాష్ రాజ్ ఆరోపించారు. రాజకీయ నాయకుల తీరుపై ప్రశ్నిస్తే బెదిరిస్తున్నారని, ఈ సమాజంలో ఎలా బతకాలని ప్రకాష్ రాజ్ ప్రశ్నించారు. బుధవారం మంగళూరులో మీడియాతో ప్రకాష్ రాజ్ మాట్లాడుతూ పబ్ దాడి కేసులో కాంగ్రెస్ కు కౌంటర్ వేశారు.
ఎయిర్ పోర్టు బయట !
మంగళవారం రాత్రి ప్రకాష్ రాజ్ మంగళూరు చేరుకున్నారు. బుధవారం మీడియాతో మాట్లాడిన ప్రకాష్ రాజ్ ఎయిర్ పోర్టు బయట ఉన్న తన కారు డ్రైవర్ దగ్గరకు గుర్తు తెలియని వ్యక్తులు వెళ్లి అతని పేరు, వివరాలు, నేను రాత్రి ఎక్కడ బసచేస్తాను అనే పూర్తి వివరాలు అడిగారని ప్రకాష్ రాజ్ ఆరోపించారు.
Recommended Video
పోలీసులు ఎంట్రీ !
తనకు భద్రత కల్పించడానికి అదే సమయంలో పోలీసులు ఎయిర్ పోర్టు దగ్గరకు వచ్చారని, పోలీసులను చూసిన గుర్తు తెలియని వ్యక్తులు డ్రైవర్ కు జాగ్రత్తగా ఉండాలని వార్నింగ్ ఇచ్చి అక్కడి నుంచి పారిపోయారని, లేదంటే తనకు నేరుగా వార్నింగ్ ఇచ్చేవారని ప్రకాష్ రాజ్ ఆరోపించారు.
భయపడను
ప్రజల సమస్యలు, ప్రభుత్వాల తీరు విషయంలో ప్రశ్నిస్తే కొందరు రాజకీయ నాయకులు తన మీద ఎదురుదాడి చేస్తున్నారని, అలాంటి బుడ్దబెదిరింపులకు తాను భయపడనని ప్రకాష్ రాజ్ అన్నారు. రాజకీయాలు అంటే తనకు ఇష్టమని, అయితే ప్రతిభావంతులు, ప్రయోజకులు రాజకీయాల్లోకి రాలేకపోతున్నారని ప్రకాష్ రాజ్ విచారం వ్యక్తం చేశారు.
పబ్ దాడి కేసు
మంగళూరు సమీపంలో పబ్ లో కొంత కాలం క్రితం చొరబడిన కొందరు వ్యక్తులు యువతి, యువకుల మీద దాడి చేశారని కేసు నమోదు అయ్యింది. అయితే ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న నిందితులను కోర్టు నిర్దోషులుగా విడుదల చేసింది. ఈ విషయంపై మాట్లాడిన ప్రకాష్ రాజ్ సరైన సాక్షాలు లేకపోవడంతో కోర్టు వారిని విడుదల చేసి ఉంటుందని అభిప్రాయం వ్యక్తం చేశారు.
వీడియో సాక్షం, కాంగ్రెస్ కు కౌంటర్
పబ్ లో యువతుల మీద దాడి చేసిన వీడియో సాక్షం కళ్ల ముందే ఉన్నా నిందితులు దర్జాగా బయటకు వచ్చారని ప్రకాష్ రాజ్ విచారం వ్యక్తం చేశారు. కర్ణాటకలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం వీడియో సాక్షం ఆధారంగా ఉన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించి ఉంటే బాగుండేదని ప్రకాష్ రాజ్ అభిప్రాయం వ్యక్తం చేశారు. ఎక్కడ తమ మీద వ్యతిరేకత పెరుగుతుందో అని ఆ పార్టీ నాయకులు వెనకడుగు వేశారని ప్రకాష్ రాజ్ కాంగ్రెస్ పార్టీకి కౌంటర్ వేశారు.