#justasking:నగదు లేదు, ఉద్యోగం లేదు..ఫ్రీ వ్యాక్సిన్ అనగానే.. మోడీ మాయ: ప్రకాశ్ రాజ్
బీహర్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి గ్రాండ్ విక్టరీ కొట్టింది. బీజేపీకి ఎక్కువ సీట్లు రావడం విశేషం. అయితే దీనిపై ప్రముఖ నటుడు ప్రకాశ్ రాజ్ స్పందించారు. తనదైన శైలిలో బీజేపీ/ నరేంద్ర మోడీపై విరుచుకుపడ్డారు. గత కొన్నాళ్లుగా కేంద్ర ప్రభుత్వ వైఖరిని ఎండగడుతోన్న సంగతి తెలిసిందే. మోడీ చేస్తానని చెప్పిన అంశాలు.. నెరవేర్చని హామీలను మరోసారి ప్రకాశ్ రాజ్ ప్రస్తావించారు.
రూ.15 లక్షలు ఏవీ..?
మోడీ ఇచ్చిన హామీల అమలు కోసం ప్రజలు కళ్లు కాయలు కాసేలా ఎదురుచూస్తున్నారని ప్రకాశ్ రాజ్ ధ్వజమెత్తారు. పేదల బ్యాంకు ఖాతాలో రూ.15 లక్షల నగదు జమ చేస్తామని చెప్పిన మాట ఏమైందని అడిగారు. ఎందుకు వేయడం లేదు.. హామీని విస్మరించారా అని నిలదీశారు. యువతకు ఉపాధి కల్పన ఏమయ్యిందని అడిగారు. ఏడాదికి రెండు కోట్ల మందికి ఉద్యోగం కల్పిస్తామని చెప్పలేదా అని కొశ్చన్ చేశారు.
ఫ్రీ వ్యాక్సిన్ అని..
స్విస్ బ్యాంక్/ ఇతర దేశాల్లో దాచిన నల్లధనాన్ని వెలికితీస్తానని చెప్పిన మాట నీటి మూటేనా అని అడిగారు. ఆర్థిక వ్యవస్థ లక్ష్యం 5 ట్రిలియన్ అంటూ ఊకదంపుడు ఉపన్యాసాలు ఇచ్చారు. మరీ ఆచరణలో ఎందుకు విఫలమవుతోందని అడిగారు. మాంద్యం నుంచి ఎందుకు గట్టెక్కలేకపోతున్నామని వివరించాలని కోరారు. ఇప్పుడు ఎన్నికలకు ముందు కరోనా వ్యాక్సిన్ ఉచితంగా అందజేస్తామని తెలిపారు. మీ మాటల గారడీతో మోసం చేస్తున్నారు.. చేస్తూనే ఉన్నారని ధ్వజమెత్తారు.
Recommended Video
వారిపైనే ప్రేమ..
బీజేపీ/ మోడీ చెబుతోన్న మాటలను దేశం వింటోంది. ప్రజలకు వారిపై విశ్వాసం మరింత పెరుగుతోంది. వారిని అధికంగా ప్రేమిస్తున్నారు. అందుకే కాబోలు ఓటు కూడా వేస్తున్నారు అని ప్రకాశ్ రాజ్ సెటైర్ విసిరారు. తప్పు ఎక్కడ ఉందో గుర్తించాలని కోరారు. దేశాన్ని నయం చేయాల్సిన అవసరం ఉంది అని.. ఎందుకంటే వారు కమలదళ మాయలో పడిపోయారని చెప్పారు. జస్ట్ ఆస్కింగ్ అంటూ ఫేస్బుక్లో పోస్ట్ చేశారు.