కావేరీ నీటి సమస్య, ఐపీఎల్ మ్యాచ్, పోలీసులపై దాడి, మండిపడిన సూపర్ స్టార్, శాంతి !
చెన్నై: కావేరీ మేనేజ్ మెంట్ బోర్డు ఏర్పాటు చెయ్యడంలో కేంద్ర ప్రభుత్వం పూర్తిగా విఫలం అయ్యిందని ఆరోపిస్తూ తమిళనాడులో తమిళ సంఘాలు చేస్తున్న ఆందోళనపై సౌత్ ఇండియా సూపర్ స్టార్ రజనీకాంత్ మండిపడ్డారు. శాంతియుతంగా పోరాటం చెయ్యాలని, చట్టాన్ని చేతుల్లోకి తీసుకోరాదని సూపర్ స్టార్ రజనీకాంత్ ఆందోళనకారులకు సూచించారు.
ఐపీఎల్ మ్యాచ్ లు రద్దు
కావేరీ మేనేజ్ మెంట్ బోర్డు ఏర్పాటు చేసే వరకు చెన్నైలో ఐపీఎల్ మ్యాచ్ లు నిర్వహించరాదని, అన్ని మ్యాచ్ లు రద్దు చెయ్యాలని తమిళనాడులోని ప్రతిపక్ష పార్టీలు, తమిళ సంఘాలు మంగళవారం ఆందోళన నిర్వహించారు.
ఆందోళనలో హింస
మంగళవారం చెన్నైలో ఐపీఎల్ మ్యాచ్ లు రద్దు చెయ్యాలని డిమాండ్ చేస్తూ అన్నాసలై ప్రాంతంలో ఆందోళన చేస్తున్న వారిని పోలీసులు అడ్డుకున్నారు. నలుపు రంగు షర్టులు వేసుకుని నిరసన వ్యక్తం చేస్తున్న వారిని అరెస్టు చెయ్యడానికి ప్రయత్నిస్తున్న సమయంలో ఆందోళనకారులు రెచ్చిపోవడంతో హింస చోటుచేసుకుంది.
పోలీసుల మీద దాడి
ఆందోళన కారులను పోలీసులు అడ్డుకోవడానికి ప్రయత్నిస్తున్న సమయంలో వారు సహనం కోల్పోయారు. ఆందోళనాకులు కొందరు అన్నాసలై ప్రాంతంలో విధుల్లో యూనీఫాంలో ఉన్న పోలీసుల మీద పిడిగుద్దులతో దాడి చేశారు. ఒక కానిస్టేబుల్ ను కిందపడేసి దాడి చెయ్యడంతో మిగిలిన ఆందోళనకారులు రెచ్చిపోయారు.
చట్టాన్ని చేతుల్లోకి తీసుకుంటారా !
యూనీఫాంలో ఉన్న పోలీసుల మీద ఆందోళనకారులు దాడి చేస్తున్న వీడియోను సూపర్ స్టార్ రజనీకాంత్ సోషల్ మీడియాలో పోస్టు చేసి అసహనం వ్యక్తం చేశారు. శాంతియుతంగా పోరాటం చెయ్యాలని, చట్టాన్ని చేతుల్లోకి తీసుకుని యూనీఫాంలో ఉన్న పోలీసుల మీద దాడి చేసి దేశానికి మీరు ఏం సందేశం ఇవ్వాలనుకుంటున్నారని సూపర్ స్టార్ రజనీకాంత్ ప్రశ్నించారు.
కఠినంగా శిక్షించాలి
యూనీఫాంలో ఉన్న పోలీసుల మీద దాడి చేసిన వారు ఎవరైనా సరే చట్టపరంగా కఠినంగా శిక్షించాలని రజనీకాంత్ అన్నారు. పోలీసుల మీద ఇలాంటి దాడులు జరిగితే దేశంలో శాంతిభద్రతలు క్షీణిస్తాయని సూపర్ స్టార్ రజనీకాంత్ ఆందోళన వ్యక్తం చేశారు.