పోలీసులను తప్పుపట్టలేం, అలాంటివారుండాలి: ‘జల్లికట్టు’పై సూర్య
జల్లికట్టు ఆందోళన హింసాత్మకంగా మారడంలో పోలీసులందరినీ తప్పుపట్టడం భావ్యం కాదని సినీ నటుడు సూర్య అభిప్రాయపడ్డారు.
చెన్నై: జల్లికట్టు ఆందోళన హింసాత్మకంగా మారడంలో పోలీసులందరినీ తప్పుపట్టడం సరికాదని ప్రముఖ సినీ నటుడు సూర్య అభిప్రాయపడ్డారు. సూర్య నటించిన 'సింగం' చిత్ర మూడో భాగం 'ఎస్3' ఫిబ్రవరిలో విడుదల కానున్న విషయం తెలిసిందే. ఈ చిత్ర విశేషాలను చెన్నైలో ఆదివారం మీడియా సమావేశంలో సూర్య వెల్లడించారు.
ఈ సందర్భంగా జల్లికట్టు ఆందోళనలో పోలీసుల విధ్వంసంపై ఆయన స్పందించారు. 'జల్లికట్టు ఉద్యమంలో పోలీసులపై విద్యార్థులు కోపంతో రగిలిపోతున్న పరిస్థితిలో పోలీసు పాత్ర ప్రధానంగా ఉన్న 'ఎస్3' విడుదల చేస్తున్నారే' అని మీడియా ప్రతినిధులు ప్రశ్నించారు.
అందుకు సూర్య బదులిస్తూ జల్లికట్టు పోరాటంలో కొన్ని ప్రాంతాలలో హింసాత్మక సంఘటనలు చోటు చేసుకున్నాయన్నారు. వీటిపై విచారణ జరుగుతోందన్నారు. ఎవరో కొందరు పోలీసులు తప్పులు చేశారని మొత్తం పోలీసు శాఖనే తప్పు పట్టలేమన్నారు. తిరుచ్చిలో పోలీసు అధికారి మైయిల్ వాహనన్ విద్యార్థుల ఆందోళనను ప్రశాంతంగా ముగించేలా చేశారన్నారు. ఇటువంటి పోలీసులు ఉంటే బాగుంటుందన్నారు.
చీకటి గదిలో ఒక కొవ్వొత్తి వెలిగిస్తేనే అది ఆ చీకటి మొత్తాన్ని తొలగిస్తుందని, జీవితంలో ఉన్నతమైన వ్యక్తులను మార్గదర్శకులుగా భావించడం మంచిదన్నారు. అటువంటి ఒక ఉత్తమమైన పోలీసు అధికారిని ఈ చిత్రకథ ప్రతిఫలిస్తుందని సూర్య తెలిపారు. ఇంతకుముందు జల్లికట్టు వివాద సమయంలో సూర్య.. పెటా(పీఈటీఏ)కు నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే. ఆ తర్వాత పెటా సూర్యను క్షమాపణలను కోరడం గమనార్హం.