స్టార్ హీరో సుశాంత్ సింగ్ ఆత్మహత్య వెనుక: రీసెంట్గా మాజీ మేనేజర్ సూసైడ్: అంకిత లోఖండేతో
ముంబై: బాలీవుడ్ స్టార్ హీరో, ఎంఎస్ ధోని ఫేమ్ సుశాంత్ సింగ్ రాజ్పుత్ ఆత్మహత్య చేసుకున్నారు. ముంబై బాంద్రాలోని తన ఫ్లాట్లో ఆయన ఉరి వేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డారు. సుశాంత్ సింగ్ ఆత్మహత్య చేసుకోవడానికి గల కారణాలు ఇంకా తెలియ రావాల్సి ఉంది. ఆదివారం మధ్యాహ్నం ఈ ఘటన చోటు చేసుకుంది. తన ఫ్లాట్లో ఉరి వేసుకున్న స్థితిలో నిర్జీవంగా కనిపించారు సుశాంత్ సింగ్. భౌతికకాయాన్ని తొలుత ఆయన ఇంటి పనిమనిషి చూశారు. వెంటనే ఈ విషయాన్ని పోలీసులకు తెలియజేశారు. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు.
Recommended Video
ఎంఎస్ ధోనీ బయోపిక్లో
స్టార్ క్రికెటర్ మహేంద్రసింగ్ ధోనీ బయోపిక్లో టైటిల్ క్యారెక్టర్లో నటించిన సుశాంత్ సింగ్ దేశవ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్నారు. కేరీర్ అత్యున్నత స్థితిలో కొనసాగుతోంది. ఈ పరిస్థితుల్లో ఆయన ఆత్మహత్య చేసుకోవడం పట్ల దేశ మొత్తం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ఆయన ఆత్మహత్య చేసుకోవడానికి గల కారణాలపై పోలీసులు దర్యాప్తు సాగిస్తున్నారు. బిహార్కు చెందిన సుశాంత్ సింగ్.. ఇప్పటిదాకా 12 సినిమాల్లో నటించారు. ఎంఎస్ ధోనీ తరువాత ఆయన నటించిన అన్ని సినిమాలూ బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షాన్ని కురిపించాయి. ఆయనకు స్టార్డమ్ను తెచ్చిపెట్టాయి.
అయిదు రోజుల కిందటే
సుశాంత్ సింగ్ రాజ్పుత్ వద్ద మేనేజర్గా పని చేసిన దిశ అనే యువతి అయిదు రోజుల కిందటే ఆత్మహత్య చేసుకున్నారు. ఈ ఘటన తరువాత ఆయన డిప్రెషన్లోకి వెళ్లారని అంటున్నారు. దిశ ఆత్మహత్య చేసుకోవడం సుశాంత్ సింగ్ను తీవ్రంగా కలవరపాటుకు గురి చేసిందనేది బాలీవుడ్ టాక్. దిశ ఆత్మహత్యపై ఆయన తన ఇన్స్టాగ్రామ్లో ప్రత్యేకంగా ప్రస్తావించారని అంటున్నారు. దిశ ఆత్మహత్య చేసుకోవడాన్ని సుశాంత్ సింగ్ జీర్ణించుకోలేకపోయారని సన్నిహితులు చెబుతున్నారు. ఆ ఘటన తరువాత అతను ముభావంగా ఉండేవాడని సమాచారం.
అంకిత లోఖండేతో రిలేషన్ షిప్
బాలీవుడ్ యువనటి అంకిత లోఖండేతో సుశాంత్ సింగ్ రాజ్పుత్ రిలేషన్షిప్ కొనసాగింది. సుమారు ఆరేళ్ల పాటు ఇద్దరు సన్నిహితంగా గడిపారని బాలీవుడ్ ప్రముఖులు చెబుతున్నారు. 2010లో ఆయన టెలివిజన్ షోలల్లో అరంగేట్రం చేసినప్పటి నుంచీ 2016 వరకూ అంకిత లోఖండేతో రిలేషన్ షిప్ కొనసాగించారని అంటున్నారు. ఇద్దరి మధ్య బ్రేకప్ తరువాత సుశాంత్ సింగ్ పూర్తిగా సినిమాలు, కేరీర్పైనే దృష్టి సారించారు.
2013లో నటించిన కై పో ఛెతో కేరీర్
అదే ఏడాది ఎంఎస్ ధోనీలో నటించడం, అది సూపర్ హిట్ కావడంతో ఇక వెనక్కి తిరిగి చూసుకునే అవకాశం ఆయనకు రాలేదు.
సుశాంత్ సింగ్ నటించిన తొలి బాలీవుడ్ చిత్రం కై పో ఛె. ఇందులో ఇషాన్ భట్గా నటించారాయన. తొలి సినిమాతోనే జీ సినీ అవార్డును అందుకున్నారు. ప్రతిష్ఠాత్మక ఫిల్మ్ఫేర్ అవార్డుకు నామినేట్ అయ్యారు. అనంతరం శుద్ధ్ దేశీ రొమాన్స్లో నటించారు. 2014లో అమీర్ ఖాన్ నటించిన పీకే సినిమాలో ఓ చిన్న పాత్రలో నటించారు.
ఎంఎస్ ధోనీ అనంతరం అన్నీ హిట్లే..
అది ఆయనకు ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చి పెట్టింది. ఆ మరుసటి ఏడాది డిటెక్టివ్ బ్యోమ్కేశ్ బక్షిలో నటించారు. అది హిట్ కానప్పటికీ.. అవకాశాలను తగ్గలేదు. ఆ మరుసటి ఏడాదే ఎంఎస్ ధోనీ బయోపిక్లో నటించారు. అది కలెక్షన్ల వర్షాన్ని కురిపించింది. అనంతరం రాబ్తా, వెల్కమ్ టు న్యూయార్క్, కేదార్ నాథ్, ఛిఛ్చోరేలతో బిజీ అయ్యారు. కేరీర్ అత్యున్నత స్థాయిలో కొనసాగుతున్న సమయంలో సుశాంత్ సింగ్ ఆత్మహత్య చేసుకోవడం పట్ల బాలీవుడ్ దిగ్భ్రాంతికి గురవుతోంది. ఆయన బలవన్మరణానికి పాల్పడటానికి గల కారణాలపై పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. విభిన్న కోణాల్లో దర్యాప్తు సాగుతోంది.