సుశాంత్ సింగ్ రాజ్పుత్ పోస్ట్మార్టమ్ రిపోర్ట్: మెడ ఎముక చిట్లి: ఆయన మరణానికి కారణం
ముంబై: స్టార్ హీరో సుశాంత్ సింగ్ రాజ్పుత్ ఆత్మహత్య ఉదంతం మిగిల్చిన ప్రకంపనల నుంచి బాలీవుడ్ ఇంకా తేరుకోలేకపోతోంది. ఆయన మరణవార్తను ఇప్పటికీ బాలీవుడ్ ప్రముఖులు జీర్ణించుకోలేకపోతున్నారు. కేరీర్ అత్యున్నత స్థితిలో ఉన్న సమయంలో ఆత్మహత్యకు పాల్పడటం పట్ల దిగ్భ్రాంతిని వ్యక్తం చేస్తున్నారు. ఆయన మరణానికి కారణం ఏమై ఉంటుందా? అని ఆరా తీస్తున్నారు. ఈ పరిస్థితుల్లో అందరి దృష్టీ పోస్ట్మార్టమ్ నివేదికపైనే నిలిచింది. పోస్ట్మార్టమ్ నివేదిక కొద్దిసేపటి కిందటే వెల్లడైంది.
Recommended Video
స్టార్ హీరో సుశాంత్ సింగ్ ఆత్మహత్య వెనుక: రీసెంట్గా మాజీ మేనేజర్ సూసైడ్: అంకిత లోఖండేతో
ఊపిరి ఆడకపోవడం వల్లే..
సుశాంత్ సింగ్ ఆత్మహత్య చేసుకోవడం వల్లే మరణించారని పోస్ట్మార్టమ్ నివేదికలో డాక్టర్లు స్పష్టం చేశారు. ఊపిరి ఆడకపోవడం, మెడ ఎముక స్వల్పంగా చిట్లిపోవడం వంటి కారణాల వల్ల సుశాంత్ సింగ్ మృతి చెందినట్లు ఇందులో పొందుపరిచారు. ఉరి వేసుకున్న సందర్భాల్లోనే ఇలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయని పేర్కొన్నారు. దీనితో ఆయన ఆత్మహత్య చేసుకున్నారనే నిర్ధారణకు వచ్చినట్లు పోలీసులు తెలిపారు. ఇది ప్రాథమిక నివేదిక మాత్రమేనని పోలీసులు ట్విస్ట్ ఇచ్చారు.
జుహు కూపర్ ఆసుపత్రిలో..
సుశాంత్ సింగ్ రాజ్పుత్ ఆదివారం ముంబై బాంద్రాలోని తన ఫ్లాట్లో ఉరి వేసుకుని బలవన్మరణానికి పాల్పడిన విషయం తెలిసిందే. ఆయన ఇంటి పనిమనిషి తొలుతగా నిర్జీవంగా వేలాడుతోన్న ఆయన మృతదేహాన్ని చూశారు. వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. సమాచారం అందుకున్న వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు భౌతిక కాయాన్ని స్వాధీనం చేసుకున్నారు. పోస్ట్మార్టమ్ కోసం అంబులెన్స్లో నేరుగా జుహూలోని కూపర్ ఆసుపత్రికి తరలించారు.
నాలుగు గంటల పాటు పోస్ట్మార్టమ్
సుమారు నాలుగు గంటల పాటు పోస్ట్మార్టమ్ కొనసాగింది. విష ప్రయోగం ఏమైనా చోటు చేసుకుందా? అనే అనుమానంతో కొన్ని ముఖ్యమైన, సున్నితమైన అవయవాలను ఫోరెన్సిక్ ల్యాబొరేటరీకి పంపించారు. రెండు గంటల పాటు అక్కడ వాటిిని పరీక్షించారు. విషపు ఆనవాళ్లు ఏవీ లేవని నిర్ధారించారు. దీనితో సుశాంత్ సింగ్ మరణానికి కారణం.. ఉరి వేసుకోవడమేనని ప్రాథమికంగా స్పష్టం చేశారు. ప్రస్తుతం సుశాంత్ సింగ్ భౌతికకాయం కూపర్ ఆసుపత్రిలోని మార్చురీలో ఉంచారు. పోస్ట్మార్టమ్ నిర్వహించడానికి ముందే భౌతికకాయానికి కరోనా వైరస్ పరీక్షలను నిర్వహించారు. ఈ పరీక్షలు నెగెటివ్గా తేలాయి. ఆయనకు కరోనా వైరస్ సోకలేదని డాక్టర్లు వెల్లడించారు.
బిహార్లో అంత్యక్రియలు
కాస్సేపట్లో ఆయన స్వరాష్ట్రం బిహార్కు తరలించనున్నారు. సుశాంత్ సింగ్ స్వస్థలం బిహార్లోని పునియా. ఆయన చిన్నప్పుడే తల్లిదండ్రులు రాజధాని పాట్నాలో స్థిరపడ్డారు. సుశాంత్ సింగ్ అక్కడే పెరిగాడు. అనంతరం ఉన్నత విద్యాభ్యాసం కోసం ఢిల్లీ వెళ్లారు. ఏఐఈఈఈలో జాతీయ స్థాయిలో ఏడో ర్యాంకును సాధించారు. క్రమంగా నటనపై ఆసక్తి పెంచుకున్నారు. అయిదేళ్ల పాటు పలు టీవీ సీరియళ్లలో నటించారు. 2013లో కై పో ఛె మూవీ ద్వారా బాలీవుడ్లో ఎంట్రీ ఇచ్చారు. సుశాంత్ భౌతికకాయానికి ఈ సాయంత్రం పాట్నాలో అంత్యక్రియలను నిర్వహించారు.