ప్రధాని పారిశుద్ధ్య కార్మికుల కాళ్లు కడగటంపై ప్రకాష్ రాజ్ ఘాటు వ్యాఖ్యలు
బెంగళూరు: ప్రముఖ నటుడు, రాజకీయ నాయకుడు ప్రకాష్ రాజ్ ప్రధానమంత్రి నరేంద్రమోడీపై ఘాటు విమర్శలు చేశారు. మోడీ ఉత్తర్ ప్రదేశ్ లోని ప్రయాగ్ రాజ్ లో కొందరు పారిశుద్ధ్య కార్మికుల కాళ్లను కడగటంపై తనదైన శైలిలో చురకలు అంటించారు. డియర్ సుప్రీమ్ లీడర్.. అంటూ ప్రధానిని సంబోధించిన ఆయన పారిశుద్ధ కార్మికుల కాళ్లను కడగటం వల్ల వారి జీవనశైలిలో సమూల మార్పులు చోటు చేసుకోబోవని అన్నారు. ప్రధాని చర్యను ఎన్నికల జిమ్మిక్కుగా అభివర్ణించారు.
ఇలాంటి చర్యలను చూసి ప్రజలు ఓటు వేస్తారని ప్రధాని భావిస్తున్నారని, ఇది ఆయన చౌకబారు విధానానికి నిదర్శనమని విమర్శించారు. కార్మికుల మెరుగైన జీవన ప్రమాణాలను పెంపొందిస్తే ఓట్లు పడతాయే తప్ప.. ఇలాంటి చర్యల వల్ల కాదని చెప్పారు. ప్రజలు అసహ్యించుకుంటారని అన్నారు. కార్మికులకు ఉద్యోగ భద్రత కల్పించాల్సిన బాధ్యత కేంద్రంపై ఉందని అన్నారు. కార్మికుల జీవన ప్రమాణాలు మెరుగు పడాలంటే వారికి ఉద్యోగ భద్రత కల్పించాలని, వారి పిల్లల భవిష్యత్తుకు భరోసా ఇవ్వాలని సూచించారు.
కార్మికులు పని చేసే ప్రదేశాల్లో ప్రమాదాల బారిన పడకుండా జాగ్రత్తలు పక్కాగా అమలు పరిచేలా చేయాలని ప్రకాష్ రాజ్ అన్నారు. ప్రమాదాలను నివారించడంలో భాగంగా కార్మికులకు మెరుగైన, ఆధునిక పనిముట్లను అందించాలని చెప్పారు. భద్రతా ప్రమాణాలను సమర్థవంతంగా పాటించేలా చూడాల్సిన బాధ్యత కేంద్రానిదేనని అన్నారు. అవన్నీ వదిలేసి, కార్మికుల కాళ్లను కడగటం వల్ల ఏ మాత్రం ఉపయోగం ఉండదని అన్నారు. కార్మికుల కాళ్లు కడగటం వంటి డ్రామాల వల్ల వారి జీవనం మెరుగుపడదని చెప్పారు.