మమతా బెనర్జీకి మరో షాక్ తప్పదా?: 16న తేల్చేస్తామంటూ టీఎంసీ ఎంపీ, ఎమ్మెల్యే సోషల్ పోస్టులు
కోల్కతా: పశ్చిమబెంగాల్ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు దగ్గరపడుతున్న కొద్దీ అధికార పార్టీకి వరుసగా ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. మే నెలలో ఆరు నుంచి ఏడు మంది బీజేపీ ఎంపీలు తమ పార్టీలో చేరతారంటూ మంత్రి జ్యోతిప్రియా మల్లిక్ చేసిన వ్యాఖ్యలకు బీజేపీ బెంగాల్ చీఫ్ దిలీప్ ఘోష్ కౌంటర్ ఇచ్చారు.
జనవరి 16న తేల్చేస్తా..: శతాబ్ది రాయ్..
అధికార టీఎంసీ పార్టీకి చెందిన 50 మంది ఎమ్మెల్యేలు బీజేపీలో చేరేందుకు సిద్ధంగా ఉన్నారని దిలీప్ ఘోష్ అన్నారు. ఈ నేపథ్యంలో తాజాగా ఓ టీఎంపీ ఎంపీ.. ఆ పార్టీని వీడి బీజేపీలో చేరుతున్నట్లు సంకేతాలివ్వడం చర్చనీయాంశంగా మారింది. దిర్భూమ్ టీఎంసీ ఎంపీ, సినీ నటి శతాబ్ధి రాయ్ బీజేపీలో చేరేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలియజేసేలా ఓ సోషల్ మీడియా పోస్టు పెట్టారు. 'నేను ఏదైనా నిర్ణయం తీసుకుంటే.. జనవరి 16 మధ్యాహ్నం 2 గంటలకు మీకు తెలియజేస్తా' అని శతాబ్ది రాయ్ సోషల్ మీడియా ఖాతాలో పేర్కొన్నారు. ఈ క్రమంలో ఆమె అభిమానులు సోషల్ మీడియాలో సంబరాలు చేసుకుంటున్నట్లు వ్యాఖ్యలు చేస్తున్నారు. 2009 నుంచి బిర్భూమ్ నుంచి ఆమె ప్రాతినిథ్యం వహిస్తున్నారు. అయితే, సోషల్ మీడియాలో పోస్టు ఆమె పెట్టారా? లేక ఆమె అభిమానులు చేశారా? అనేది త్వరలోనే తేలనుంది.
పార్టీకి దూరం పెట్టడమే కారణమా?
కాగా, ఈ సోషల్ మీడియా పోస్టు తర్వాత రాయ్ మీడియాకు దూరంగా ఉండటం గమనార్హం. పలు అధికారిక కార్యక్రమాలకు ఆహ్వానించకపోవడం వల్లే శతాబ్ది రాయ్ టీఎంసీపై కొంత అసంతృప్తితో ఉన్నట్లు తెలుస్తోంది. పార్టీలో కొందరు తనను బయటికి పంపించాలని చూస్తున్నారని, తాను ఎలా వెళ్లాలంటూ సోషల్ మీడియాలో పోస్టులో ఆమె పేర్కొన్నారు. బోల్పూర్లో డిసెంబర్ 29న నిర్వహించిన మార్చ్లో ముఖ్యమంత్రి, టీఎంసీ మమతా బెనర్జీతోపాటు శతాబ్ది రాయ్ కూడా పాల్గొన్నారు.
మమతా బెనర్జీని ఉద్దేశిస్తూ..
2009 నుంచి నేను మీకు కృతజ్ఞతతో ఉన్నాను. మీరు మద్దతు పలికి నన్ను లోక్సభకు పంపారు. ఇదే సన్నిహిత సంబంధాలు భవిష్యత్తులో కూడా కొనసాగుతాయని కోరుకుంటున్నా. అయితే, నేను ఎంపీ కాకముందు నుంచే బెంగాల్ ప్రజలు నన్నెంతో అభిమానించారు. నా విధులు నేను నిర్వహించడానికి ఎప్పుడూ సిద్ధమే. జనవరి 16న మధ్యాహ్నం 2 గంటలకు నా నిర్ణయం తెలియచేస్తానని శతాబ్ది రాయ్ తెలిపారు.
ఎంపీ శతాబ్దితోపాటు మంత్రి రాజీబ్ బెనర్జీ కూడా 16నే ముహూర్తం
కాగా, టీఎంపీ మరో ఎంపీ సౌగత రాయ్.. శతాబ్ది రాయ్ వ్యాఖ్యలపై స్పందించారు. మానసిక వేదన అంటూ శతాబ్ది పేర్కొనడంపై ఆయన ఆశ్చర్యం వ్యక్తం చేశారు. శనివారం వరకు తాము ఆమె ప్రకటన కోసం వేచి చూస్తామని, అప్పటి వరకు టీఎంసీ పార్టీ ఈ విషయంపై స్పందించదని స్పష్టం చేశారు. ఇది ఇలావుంటే, మరో టీఎంసీ నేత, మంత్రి రజీబ్ బెనర్జీ కూడా శనివారం మధ్యాహ్నం 3 గంటలకు తన సోషల్ మీడియా ఖాతాలో లైవ్లోకి వచ్చి కీలక విషయాలు వెల్లడిస్తానని చెప్పారు. పార్టీ మారతారనే ఊహాగానాల నేపథ్యంలో టీఎంసీ నేత పార్థ ఛటర్జీ.. రాజీబ్ బెనర్జీతో రెండు సార్లు చర్చలు జరిపారు. అయినా రాజీబ్ నుంచి మెత్తబడలేదు. కాగా, డిసెంబర్ 19న ఏడుగురు టీఎంసీ ఎమ్మెల్యేలు కేంద్రమంత్రి అమిత్ షా సమక్షంలో బీజేపీలో చేరిన విషయం తెలిసిందే.