రజనీకాంత్ ఫ్యాన్స్ ను కత్తులతో పొడిచిన హీరో విజయ్ ఫ్యాన్స్: ఫ్లెక్సీలు, జైల్లో!
చెన్నై: తమిళనాడులో సౌత్ ఇండియా సూపర్ స్టార్ రజనీకాంత్ ఫ్యాన్స్ మీద ప్రముఖ హీరో విజయ్ అభిమానులు కత్తులతో దాడి చేశారు. రజనీకాంత్, విజయ్ అభిమానులు గొడవతో ఈ రోడ్ జిల్లాలోని పలు ప్రాంతాలు ఉద్రిక్తంగా మారిపోయాయి. రజనీకాంత్ అభిమానులపై హత్యాయత్నం చేసిన విజయ్ అభిమానులను తమిళనాడు పోలీసులు అరెస్టు చేసి జైలుకు పంపించారు.
గుడిలో ఉత్సవాలు
తమిళనాడులోని ఈరోడ్ జిల్లా గోపిషెట్టిపాళయం సమీపంలో ఉన్న పారియూర్ కొండత్తు కాళియమ్మన్ ఆలయంలో ఉత్సవాలు జరిగాయి. ఈ సందర్భంగా నంజకౌంటన్ పాళయంకు చెందిన రజనీకాంత్ అభిమానుల తరఫున ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు.
హీరో విజయ్ ఫ్యాన్స్
నంజకౌంటన్ ప్రాంతానికి చెందిన విజయ్ అభిమానులు రత్నవేల్, త్యాగు, సతీష్ అనే ముగ్గురు కలిసి రజనీకాంత్ అభిమానులు జగదీషన్, పళనిస్వామి తదితరులతో ఇక్కడ ఫ్లెక్సీలు ఎందుకు ఏర్పాటు చేశారు అంటూ వాగ్వాదానికి దిగారు.
ఫ్లెక్సీలు కాల్చి, కత్తులతో !
రజనీకాంత్, విజయ్ ఫ్యాన్స్ మధ్య జరిగిన ఘర్షణలో సతీష్, రత్నవేల్, త్యాగు కలిసి సూపర్ స్టార్ రజనీకాంత్ అభిమానులు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలు కాల్చివేశారు. మా హీరో ఫెక్సీలు తగలబెట్టకూడదని అడ్డుపడిన రజనీకాంత్ అభిమానులు జగదీషన్, పళణిస్వామి మీద విజయ్ ఫ్యాన్స్ కత్తులతో దాడి చేశారు.
జైల్లో విజయ్ ఫ్యాన్స్
తీవ్రగాయాలైన రజనీకాంత్ అభిమానులు జగదీషన్, పళనిస్వామి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన గోపిషెట్టి పాళయం పోలీసులు విజయ్ అభిమానులు రత్నవేల్, సతీష్, త్యాగులను అరెస్టు చేసి కోర్టులో హాజరుపరచి జైలుకు పంపించారు.
ఫ్యాన్స్ కు కౌన్సిలింగ్
ఆలయంలో ఉత్సవాల సందర్బంలో రజనీకాంత్, విజయ్ అభిమానుల మధ్య ఘర్షణకు దారి తియ్యడంతో గోపిషెట్టి పాళయం పోలీసులు అలర్ట్ అయ్యారు. రజనీకాంత్, విజయ్ అభిమానులను పోలీస్ స్టేసన్ కు పిలిపించి ఇక ముందు ఇలాంటి సంఘటనలు ఎదురుకాకుండా చూడాలని, జాగ్రత్తగా ఉండాలని కౌన్సిలింగ్ ఇచ్చారు.