పోలీసులను ఆశ్రయించిన హీరో విశాల్, వారిని ఏం చేశారో ? భయంగా ఉంది !
చెన్నై: ఆర్ కే నగర్ ఉప ఎన్నికల్లో తాను పోటీ చెయ్యడానికి మద్దతుగా నా నామినేషన్ పత్రాల్లో సంతకాలు చేసిన సుమతి, దీపన్ కనపడటం లేదని, వారి ఆచూకి చెప్పండి అంటూ బహుబాష నటుడు, నడిగర్ సంఘం ప్రధాన కార్యదర్శి, తమిళ సినీ నిర్మాతల సంఘం అధ్యక్షుడు విశాల్ చెన్నై నగర పోలీసులను ఆశ్రయించాడు.
ఎన్నికల కమిషన్ అధికారులు ఇచ్చిన గడువు పూర్తి కావడంతో ఇక తాను ఆర్ కే నగర్ శాసన సభ ఉప ఎన్నికల్లో పోటీ చెయ్యడానికి అవకాశం చాల తక్కువగా ఉందని పసిగట్టిన హీరో విశాల్ పరోక్షంగా తమిళనాడు ప్రభుత్వం మీద విమర్శలు గుప్పించారు.
తాను ఆర్ కే నగర్ ఉప ఎన్నికల్లో పోటీ చేసినా, చెయ్యకపోయినా ఎలాంటి ఇబ్బంది లేదని, తనకు మద్దతు తెలిపిన సుమతి, దీపన్ క్షేమంగా ఉంటే చాలని హీరో విశాల్ అంటున్నారు. ప్రజాస్వామ్యం మాత్రం ఓడిపోయిందని విశాల్ ఆరోపించారు.
తన నామినేషన్ పత్రాలపై సంతకాలు పెట్టిన తన మద్దతుదారులు సుమతి, దీపన్ ఆచూకి తేలియడం లేదని హీరో విశాల్ ఆందోళన వ్యక్తం చేశారు. ఆ ఇద్దరినీ గురువారం మద్నాహ్నం 3 గంటలకు ఎన్నికల కమిషన్ ముందు హాజరుపరచడానికి, వారికి ఆ సమాచారం ఇవ్వాలని మీడియా ద్వారా మనవి చేసినా ప్రయోజనం లేదని విశాల్ విచారం వ్యక్తం చేశారు.